తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం మిస్టరీని నిగ్గు తేల్చేందుకు ఆర్ముగ స్వామి కమిషన్ మళ్లీ విచారణకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ ఈ క్రమంలో మాజీ సీఎం, అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వంకు ఆర్ముగ స్వామి కమిషన్ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే పన్నీరు సెల్వం విచారణకు హాజరుకావాల్సి ఉండగా ఆయన డుమ్మా కొడుతూ వచ్చారు.
ఈ క్రమంలో ఈనెల 21న పన్నీర్ సెల్వం విచారణకు హాజరు కావాలని తాజా నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. అలాగే మరోవైపు జయలలిత నివాసంలో సుదీర్ఘ కాలం ఉన్న చిన్నమ్మ శశికళ వదిన ఇలవరసికి కూడా సమన్లు జారీ అయ్యాయి. ఈ కేసు విచారణ సమయంలో ఇలవరసి అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెను కూడా విచారణ చేయాలని కమిషన్ నిర్ణయించింది.
శశికళతో పాటుగా జయలలిత నివాసం పోయేస్ గార్డెన్లో సుదీర్ఘ కాలం ఇలవరసి కూడా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక జయలలిత మృతి కేసులో రెండు రోజులుగా అపోలో వైద్యులు విచారణకు హాజరయ్యారు. జయలలిత గుండెపోటు రావడంతోనే మరణించారని వైద్యులు స్పష్టం చేశారు. అయితే ఆమెకు రక్తనాళాల మార్పిడి శస్త్ర చికిత్స విషయంగా జయలలిత నెచ్చెలి శశికళ తరపు న్యాయవాది రాజ చెందూర్ పాండియన్క్రాస్ ఎగ్జామిన్లో ప్రశ్నలు సంధించారు.