Sabarimala: అయ్యప్ప మహా దర్శనానికి ఏర్పాట్లు, రేపు తెరుచుకోనున్న ఆలయం

  • Written By:
  • Publish Date - November 16, 2023 / 05:32 PM IST

Sabarimala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్ ఇది. కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రం వార్షిక వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది మండల మకరవిళక్కు వేడుకలు నవంబర్‌ 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు కేరళ దేవాదాయ శాఖ మంత్రి రాధాకృష్ణన్ వెల్లడించారు. రెండు నెలలపాటు కొనసాగే ఈ అయ్యప్ప మహా దర్శనానికి అన్ని రకాల ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. ప్రతి ఏటా శీతాకాలంలో నిర్వహించే ఈ అయ్యప్ప దర్శనాలు రెండు నెలల పాటు జరగనున్నాయి.

భారీగా భక్తులు తరలివస్తున్నందున విస్తృత ఏర్పాట్లు చేశామని, విభిన్న శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కేరళ మంత్రి రాధాకృష్ణన్ తెలిపారు. పొరుగు రాష్ట్రాల యంత్రాంగంతో కూడా సమన్వయం చేస్తున్నట్టు తెలిపారు. ఆలయం వద్ద ఉండే సమాచారం యాత్రికులకు అర్థమయ్యేలా విభిన్న భాషల్లో ఉండాలన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు చెప్పారు. అందువల్ల దక్షిణాది రాష్ట్రాల భాషల్లో సమాచారాన్ని డిస్‌ప్లే చేయాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని దేవస్థానం బోర్డులు కలిసి పనిచేస్తున్నాయని, తాత్కాలిక బస చేసేందుకు వీలుగా ఆయా దేవస్థానాలు సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాయని వివరించారు.