Actor Vijay : ‘నీట్’ పరీక్షలో అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజీపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న తరుణంలో ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ తొలిసారిగా స్పందించారు. దేశ ప్రజలు నీట్ పరీక్షపై విశ్వాసం కోల్పోయారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన ఆ పరీక్ష ఇక మన దేశానికి అక్కరలేదని విజయ్ పేర్కొన్నారు. నీట్ నుంచి విద్యార్థులకు మినహాయింపు కల్పించడం ఒక్కటే ప్రస్తుతానికి పెద్ద పరిష్కారమని స్పష్టం చేశారు. నీట్ పరీక్షకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నానని ఆయన చెప్పారు. తమిళనాడు ప్రజల భావోద్వేగాలను గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విద్యను ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితాలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘రాజ్యాంగాన్ని సవరించి ‘ప్రత్యేక ఉమ్మడి జాబితా’ను తయారుచేయాలి. అందులో విద్య, ఆరోగ్యాన్ని చేర్చాలి’’ అని విజయ్(Actor Vijay) సూచించారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘వైద్యసీట్లను భర్తీ చేసే అవకాశాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలి. ఇంతకుముందులా 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించాలి’’ అని పేర్కొంటూ ఓ తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ ఇటీవల ఆమోదించింది. ఈ తీర్మానానికి విపక్ష నేతలు కూడా మద్దతు ప్రకటించారు. ఇటీవల లోక్సభలో డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ.. ‘‘నీట్ పరీక్ష వద్దని తమిళనాడు పదేపదే చెబుతోంది. నీట్ నిర్వహణ సరిగ్గా లేదని వెల్లడైంది. దానివల్ల విద్యార్థులు నష్టపోతున్నారని తేలింది. ఇంకా ఆ పరీక్ష ఎందుకు ?’’ అని ప్రశ్నించారు.
ఈ ఏడాది మే 5న నీట్ యూజీ పరీక్షను దేశవ్యాప్తంగా 4,570 కేంద్రాల్లో నిర్వహించారు. దీనికి దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడంపై దుమారం రేగింది. ఒకే సెంటర్లో పరీక్ష రాసిన పలువురు విద్యార్థులకు ఫస్ట్ ర్యాంకు రావడం అనుమానాలకు దారితీసింది. దీనిపై దర్యాప్తు చేయగా ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం వెలుగుచూసింది.