మెడికల్ కాలేజీ ఫ్రెషర్స్ పార్టీలో 66 మందికి సోకిన కరోనా*కర్ణాటక రాష్ట్రంలోని ఓ మెడికల్ కాలేజీలో కరోనా కేసులు ఒకేసారి పదుల సంఖ్యలో నమోదు కావడం కలకలం రేపింది.
కర్ణాటకలోని ధార్వాడ్లో ఒకేసారి 66 మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకింది. వ్యాక్సినేషన్ కంప్లీట్ అయినవాళ్ళకి కూడా కరోనా పాజిటివ్ రావడం పట్ల కొంత ఆందోళన మొదలైంది.
కర్ణాటక లోని ఎస్డీఎం కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఇటీవలే ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో 300 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు కరోనా టెస్ట్ చేయించుకోగా, వారిలో 66 మందికి పాజిటివ్గా తేలిందని కాలేజీ మేనేజ్మెంట్ తెలిపింది.
విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా క్యాంపస్ లోని రెండు హాస్టళ్లను మూసివేశారు. కాలేజీలో ప్రస్తుతం ఫిజికల్ క్లాసులు నిలిపివేసినట్లు ప్రకటించారు.
కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోస్లు వేసుకున్నవారికి కూడా కరోనా సోకిందని, వారికి హాస్టల్లోనే చికిత్స చేయిస్తామని ధార్వాడ్ డిప్యూటీ కమిషనర్ నితీష్ పాటిల్ తెలిపారు. విద్యార్థులను క్వారంటైన్ చేశామని, హాస్టళ్ల నుంచి వారిని బయటకు రానివ్వడంలేదని, మరిన్ని కేసులు పెరిగినా వైద్యం అందించే సదుపాయాలు సిద్ధం చేశామని కాలేజీ యాజమాన్యం తెలిపింది.