22 Families Fined : నీటిని వృథా చేసిన 22 కుటుంబాలపై అధికారులు కన్నెర్ర చేశారు. ఒక్కో కుటుంబంపై రూ.5 వేలు చొప్పున జరిమానాలు విధించింది. వారి వద్ద నుంచి మొత్తం రూ.1.10 లక్షలు వసూలు చేసింది. తాగునీటిని కార్లు కడిగేందుకు, మొక్కలకు, ఇతర అత్యవసరం కాని వాటికి వాడినందుకు ఈ ఫైన్ వేశారు. సోషల్ మీడియాలో అందిన ఫిర్యాదుల ఆధారంగా ఆయా కుటుంబాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ దుస్థితి నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న బెంగళూరు నగరంలో నెలకొంది. ఆ పరిస్థితి మనకు రాకూడదంటే.. ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వాడటం అలవాటు చేసుకోవాలి. పైన మనం చెప్పుకున్న జరిమానాల విషయంలోకి వెళితే..
We’re now on WhatsApp. Click to Join
బెంగళూరు నగరంలోని పలు హోటళ్లు హోలీ వేళ రెయిన్ డ్యాన్స్ ఈవెంట్లు నిర్వహిస్తామని ప్రకటించాయి. ఈవిషయం తెలుసుకున్న బెంగళూరు వాటర్బోర్డు కావేరి నీరు, బోర్ నీళ్లతో హోలీ వేడుకలు నిర్వహించడాన్ని బ్యాన్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెయిన్ డ్యాన్సులు ఉంటాయని ప్రకటించిన హోటళ్లు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయి. నగరంలో తీవ్రమైన నీటి కొరత ఉన్న ప్రస్తుత తరుణంలో కావేరి నీటిని అనవసరంగా వాడుకున్నందుకు 22 ఫ్యామిలీలపై(22 Families Fined) బెంగళూరు వాటర్ సప్లై అండ్ సెవరేజ్ బోర్డు చెరో 5వేల రూపాయల జరిమానా వేసింది. షాపులు, అపార్ట్మెంట్లు, హోటళ్లు, పరిశ్రమల్లో నీటి వాడకాన్ని నియంత్రించేందుకుగాను ఎయిరేటర్స్ను వాడాలన్న నిబంధనను నగరంలో ఇప్పటికే అమలు చేస్తున్నారు. నగరంలో ఎండిపోయిన సరస్సులను శుద్ధి చేసిన మురుగునీటితో నింపడం ద్వారా బెంగళూరు నీటి సరఫరా బోర్డు చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. దీనివల్ల వేసవికి ముందు బోర్వెల్లను రీఛార్జ్ చేయడంలో సహాయపడటం, తద్వారా నీటి కొరతను తగ్గించవచ్చని భావిస్తోంది.