20000 Stranded : తమిళనాడులోని దక్షిణ జిల్లాలలో ఉన్న వరద ప్రభావిత ప్రాంతాల్లో దారుణ పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ 20వేల మంది ప్రజలు వరదల వలయంలోనే చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు. పొంగిపొర్లుతున్న తామరబరాణి నది నుంచి 1.2 లక్షల క్యూసెక్కులకుపైగా నీటిని విడుదల చేయడంతో ఈ జిల్లాలలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి మరింత దిగజారింది. ఈనేపథ్యంలో సహాయక చర్యలను చేపట్టేందుకు ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) చేతులు కలిపాయి.
We’re now on WhatsApp. Click to Join.
ట్యూటికోరిన్ సిటీలో గత మూడు రోజులుగా వర్షాలు లేనప్పటికీ పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు. వరదల కారణంగా అతలాకుతలమైన శ్రీవైకుంటంలో సహాయక చర్యలు మందకొడిగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాల్లోని చాలా ఏరియాలలో రోడ్లు పూర్తిగా వరదల్లో మునిగిపోయాయి. దీంతో హెలికాప్టర్ల ద్వారా ఆహార పదార్థాలు, సహాయక సామగ్రిని జారవిడుస్తున్నారు. చెన్నై, దాని పరిసర ప్రాంతాలు ఇప్పటికీ మైచాంగ్ తుఫాను క్రియేట్ చేసిన విధ్వంసం గుప్పిట్లోనే కొట్టుమిట్టాడుతున్నాయి. గత 47 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా వర్షాలు కురవడంతో ఇంత ప్రమాదకర రీతిలో వరదలు(20000 Stranded) పోటెత్తాయి. తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, తెన్కాసి జిల్లాలను వరదలు అతలాకుతలం చేశాయి.
‘‘వరదలతో జరిగిన మొత్తం నష్టాన్ని అంచనా వేయడానికి ఇంకా టైం పడుతుంది. జీవనోపాధి మద్దతు, మరమ్మతులు, ప్రజా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ కోసం ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నాలను బలోపేతం చేయడానికి జాతీయ విపత్తు ఉపశమన నిధి నుంచి రూ.2వేల కోట్ల తక్షణ సాయాన్ని అందించాలి’’ అని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఓ ట్వీట్ చేశారు. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసిన తమిళనాడు ముఖ్యమంత్రి తన మెమొరాండంలో ఈ అంశాలను ప్రస్తావించారు.