BJP MLAs : ‘హనీ ట్రాప్’ వ్యవహారంపై ఇవాళ (శుక్రవారం) కర్ణాటక అసెంబ్లీ దద్దరిల్లింది. ఈ అంశాన్ని ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు లేవనెత్తడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ‘హనీ ట్రాప్’ అంశంపై సీబీఐ దర్యాప్తు చేయాలని వారు డిమాండ్ చేశారు. శాసనసభ కార్యకలాపాలకు అడ్డుపడిన 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం ముస్లిం కోటా బిల్లును పాస్ చేయడాన్ని విమర్శిస్తూ.. బీజేపీ ఎమ్మెల్యేలు(BJP MLAs) స్పీకర్ వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. దీంతో వారి తీరుపై సీఎం సిద్ధరామయ్య ఫైర్ అయ్యారు. కేసు దర్యాప్తు జరిగి, హనీట్రాప్లో ప్రమేయం ఉన్నవారి పేర్లు బయటికి వస్తే కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సస్పెండైన ఎమ్మెల్యేలను మార్షల్స్ బలవంతంగా అసెంబ్లీ బయటకు తీసుకెళ్లారు. స్పీకర్ జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వుల ప్రకారం.. వేటుకు గురైన సభ్యులు అసెంబ్లీ హాల్, లాబీ, గ్యాలరీలలోకి ఆరు నెలల పాటు ప్రవేశించకూడదు. వారు ఏ స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో కూడా పాల్గొనకూడదు. అసెంబ్లీ ఎజెండాలో వారి పేర్లతో ఎలాంటి అంశం లిస్ట్ కాకూడదు. ఈ సమయంలో వారికి రోజూవారీ భత్యాలు కూడా అందవు.
Also Read :Baba Ramdev: గంగానదిలో స్పీడుగా ఈతకొట్టిన బాబా రాందేవ్.. ఎందుకంటే..
మంత్రుల వ్యాఖ్యలతో దుమారం..
- ‘‘కర్ణాటకకు చెందిన అనేకమంది నేతలు హనీ ట్రాప్లో చిక్కుకున్నారు. నాకు తెలిసినంతవరకు దాదాపు 48 మంది ఇందులో బాధితులుగా ఉన్నారు. సీడీలు, పెన్డ్రైవ్లలో వారి అసభ్య వీడియోలు ఉన్నాయి. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితమైన విషయం కాదు. అధికారపక్షం సహా విపక్షానికి చెందినవారు ఈ బాధితుల్లో ఉన్నారు’’ అని కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న ఇటీవలే అసెంబ్లీలో ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో హనీట్రాప్ వ్యవహారంపై వివాదం మొదలైంది.
- రాష్ట్ర మంత్రి సతీశ్ జార్కిహోళీ మాట్లాడుతూ.. ‘‘ఒక మంత్రిపై రెండుసార్లు హనీ ట్రాప్ యత్నం జరిగిన విషయం వాస్తవమే. అయితే, ఇది రాష్ట్రానికి కొత్త కాదు. రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది వీటిని వాడుకుంటున్నారు’’ అని వ్యాఖ్యానించారు.