తమిళనాడులోని కోయంబత్తూర్లో ఘోరం జరిగింది. సూలూరు ఏరియాలో కిరాణా సామాన్లు తేవడానికి వెళ్లిన పదేళ్ల బాలిక కిడ్నాప్కు గురైంది. ఆపై ఆ చిన్నారిని దుండగులు దారుణంగా హత్య చేశారు. శుక్రవారం చెరువు సమీపంలో మృతదేహం దొరికింది. ఈ ఘటనపై తమిళనాడు కొత్త సీఎం విజయ్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి అమానవీయ చర్యలను అస్సలు సహించబోమని స్పష్టం చేశారు.
కఠిన శిక్షపడేలా చేస్తాం: విజయ్
‘‘ఈ ఘోర ఘటన దిగ్భ్రాంతిని, వేదనను కలిగించింది. ఇలాంటి అమానవీయ నేరాలను సహించబోం. కుటుంబ సభ్యులకు నా సానుభూతి. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. సమగ్రంగా విచారణ జరిపి తక్షణమే చార్జ్షీట్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించాం. మహిళలు, పిల్లలపై ఇలాంటి ఘోరాలకు ఒడిగట్టే వారికి చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా తమిళనాడు ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకుంటుంది’’ అని విజయ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
రాజకీయ దుమారం
ఈ హత్య రాష్ట్రంలో పెద్ద రాజకీయ దుమారం రేపింది. కొత్త ప్రభుత్వంపై ప్రతిపక్ష డీఎంకే తీవ్ర విమర్శలు చేసింది. సీఎం విజయ్ పదవి చేపట్టిన 12 రోజుల్లోనే నేరాలు పెరిగాయని ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని మండిపడ్డారు. మరోవైపు గత డీఎంకే ప్రభుత్వమే వ్యవస్థను నాశనం చేసిందని బీజేపీ విమర్శించింది.
ఇద్దరు నిందితుల అరెస్ట్
ఈ కేసులో కార్తీక్, మోహన్ రాజ్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణను వేగవంతం చేయడానికి తమిళనాడు డీజీపీ స్వయంగా కోయంబత్తూర్ వెళ్లారు. సీఎం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు మృతదేహాన్ని తీసుకోబోమని కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆసుపత్రికి వెళ్లి బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
கோயம்புத்தூரில் நேற்று 10 வயது சிறுமிக்கு நிகழ்ந்த கொடூர சம்பவம் மிகுந்த வேதனையையும், அதிர்ச்சியையும் அளிக்கிறது. இத்தகைய மனிதநேயமற்ற மற்றும் மன்னிக்க முடியாத குற்றச் செயல்கள் நமது சமூகத்தில் ஒருபோதும் ஏற்றுக்கொள்ளப்பட முடியாது.
தங்கள் உயிருக்குயிரான குழந்தையைப் பிரிந்து வாடும்…
— CMOTamilNadu (@CMOTamilnadu) May 23, 2026
