కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. పాత పెన్షన్ స్కీమ్ (Old Pension Scheme) ఎంచుకోవడానికి వన్ -టైమ్ ఆప్షన్కు తాజాగా అవకాశం కల్పించింది. ఈ మేరకు పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ అవకాశం ఎంపిక చేసిన కొన్ని గ్రూపుల ఉద్యోగులకు మాత్రమే లభించనుంది. పూర్తి వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (National Pension System) 2003 డిసెంబర్ 22న నోటిఫై చేశారు. అయితే, నోటిఫై చేసిన పోస్ట్లకు వ్యతిరేకంగా నోటిఫై తేదీ కంటే ముందు కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో చేరిన ఉద్యోగులు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్ -1972 ప్రకారం పాత పెన్షన్ స్కీమ్లో చేరడానికి అర్హులు.
ఎంపిక చేసిన గ్రూప్ ఉద్యోగులు 2023 ఆగస్టు 31లోపు ఆప్షన్ను ఎంచుకోవచ్చు. ఒకసారి ఎంచుకునే ఆప్షన్ ఫైనల్ అని సదరు మంత్రిత్వ శాఖ తెలిపింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ & ట్రైనింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ అఫైర్స్లతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఆప్షన్ ఉపయోగించుకోవడానికి అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులు, ఒకవేళ నిర్ణీత తేదీలోపు ఈ ఆప్షన్ను ఉపయోగించుకోకపోతే, వారు నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద కవర్ అవుతారని పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది.
CCS (పెన్షన్) రూల్స్, 1972 కింద కవరేజీ అనేది ప్రభుత్వ ఉద్యోగి ఎంచుకునే ఆప్షన్ ఆధారంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగి CCS (పెన్షన్) రూల్స్-1972 కింద కవరేజీ కోసం షరతులను నెరవేర్చితే, దీనికి సంబంధించి అవసరమైన ఆర్డర్ను 2023 అక్టోబర్ 31 నాటికి అప్పుడు తాజాగా జారీ చేయనున్నారు. ఈ ప్రభుత్వ ఉద్యోగుల National Pension System ఖాతా 2023 డిసెంబర్ 31 నుంచి క్లోజ్ చేయనున్నారు.
14 లక్షల మందికి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో కూడిన నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (National Movement for Old Pension Scheme) అనే సంస్థ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాన్ని స్వాగతించింది.‘అర్హత ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది శుభవార్త. పాత పెన్షన్ స్కీమ్ (Old Pension Scheme) ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్తింపజేయడానికి ప్రస్తుత ఎన్పీఎస్ను సవరించాలని మేం మళ్లీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.’ అని National Movement for Old Pension Scheme ఢిల్లీ యూనిట్ హెడ్ మంజీత్ సింగ్ పటేల్ వెల్లడించారు.