Muslim Man – Goddess Ornaments : ఒడిశా రాష్ట్రం కటక్లోని సతాతా ప్రాంతంలో దుర్గామాత ఆలయం ఒకటి ఉంది. ఈ ఆలయం ఆధ్వర్యంలో ఏటా నవరాత్రుల వేళ దుర్గామాతను భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. అయితే ఈ ఆలయ కమిటీ సభ్యుడు ఒకరు గతంలో తన సొంత ఖర్చుల (దాదాపు రూ.48వేలు)తో దుర్గామాత నవరాత్రి పూజల కోసం మండపం తయారీ పనులను చేయించాడు. అయితే ఆ డబ్బులు ఆలయ కమిటీ నుంచి ఎంతకూ తిరిగి రాకపోవడంతో.. అతడు దుర్గామాత బంగారు ఆభరణాలను తీసుకెళ్లి తనఖా పెట్టాడు. తనకు రావాల్సిన రూ.48వేలు తీసుకున్నాడు. ఇప్పుడు దుర్గా నవరాత్రి పూజలు సమీపించిన తరుణంలో ఈవిషయంపై ఆలయ కమిటీలో చర్చ జరిగింది. ఈవిషయం తెలియడంతో స్థానిక ముస్లిం నేత షేక్ లియాకత్ ఉద్దీన్ అహ్మద్ .. అమ్మవారి ఆభరణాలను తనఖా నుంచి విడిపించేందుకు అవసరమైన రూ. 48 వేలను ఇచ్చారు. దీంతో ఆ ఆభరణాలను తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు. మతాలకు అతీతంగా ఉదారంగా వ్యవహరించిన లియాకత్ పై (Muslim Man – Goddess Ornaments) స్థానికులు ప్రశంసల జల్లు కురిపించారు.
We’re now on WhatsApp. Click to Join.
తాము గత 14 తరాలుగా సతాతా ప్రాంతంలోనే హిందువులతో సోదరభావంతో కలిసిమెలిసి జీవిస్తున్నామని షేక్ లియాకత్ ఉద్దీన్ అహ్మద్ అన్నారు. స్థానిక వ్యక్తిగా అమ్మవారి ఆభరణాలను తనఖా నుంచి విడిపించడం తన బాధ్యత అనుకొని ఈ సాయం చేశానని పేర్కొన్నారు. సోదరభావానికి మారుపేరుగా నిలిచే కటక్ వాసిగా గర్విస్తున్నానని ఆయన తెలిపారు. గత 25 ఏళ్లుగా తాను స్థానిక దుర్గా పూజ కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్న విషయాన్ని లియాకత్ గుర్తు చేశారు.