సౌర మండలంలో అతిపెద్ద గ్రహం గురుగ్రహం. దానిపై నిఘా కోసం నాసా మోహరించిన స్పేస్ క్రాఫ్ట్ పేరు “జూనో”. ఇది గురుగ్రహం చుట్టూ తిరుగుతూ .. అందులో జరుగుతున్న చర్యలను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తోంది. ఆ ఫోటోలు, వీడియోలను నాసా కు పంపుతోంది. ఈక్రమంలోనే ఇటీవల అది పంపిన కొన్ని ఫోటోలలో గురు గ్రహం కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. జూపిటర్ మేఘాలపై 5300 కిలోమీటర్ల ఎత్తు నుంచి విహరిస్తూ ఈ ఫోటోలను “జూనో” తీసింది. గంటకు 2.09 లక్షల కిలోమీటర్ల వేగంతో జూపిటర్ పై తిరుగుతూ ఈ అరుదైన ఫోటోలను జూనో తన కెమెరాలో బంధించింది. జూపిటర్ కు అత్యంత చేరువగా వెళ్లిన క్రమంలో ఈ ఫోటోలను జూనో క్లిక్ అనిపించడం గమనార్హం.
ఇద్దరు సైంటిస్టులు ఈ ఫోటోలకు..
వాస్తవానికి ఈ ఫోటోలు భూమికి పంపినప్పుడు కలర్ ఫుల్ గా లేవు. కానీ వాటిని బీజార్న్ జాన్సన్, యాండ్రి లక్ అనే ఇద్దరు సైంటిస్టులు ఈ ఫోటోలకు రంగులు అద్ది కలర్ ఫుల్ పిక్చరైజేషన్ చేశారు. ఇంతకుముందు కూడా గురు గ్రహంతో ముడిపడిన ఎన్నో కొత్త విషయాలను జూనో స్పేస్ క్రాఫ్ట్ గుర్తించింది. 2020 సంవత్సరం లో ఒక ఆస్టరోయిడ్ గురు గ్రహాన్ని ఢీకొట్టింది.ఆ ఆస్టరోయిడ్ దాదాపు 5000 కిలోగ్రాముల బరువు కలిగినదని జూనో అప్పట్లో పక్కా కొలతలతో గుర్తుంచింది.
ఈ ఏడాది ఏప్రిల్ లో..
ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీన సుమారు 32000 కిలోమీటర్ల దూరం నుంచి గురుగ్రహాన్ని జూనో కెమెరాలు షూట్ చేశాయి. గంటకు రెండు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే జూనో స్పేస్క్రాఫ్ట్ ఈ వీడియోను చిత్రీకరించింది. బృహస్పతికి చెందిన దక్షిణ ద్రువాన్ని ఈ వీడియోలో షూట్ చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్లో గురుగ్రహానికి మరింత దగ్గరగా జూనో వెళ్తుందని నాసా శాస్త్రవేత్తలు గతంలో అంచనా వేశారు. వాళ్ళ అంచనాలను నిజం చేస్తూ ఈ నెలలో చాలా చేరువగా వెళ్ళింది. 2011 ఆగస్టులో జూనో స్పేస్క్రాఫ్ట్ను నింగికి పంపారు. అయిదేళ్ల ప్రయాణం తర్వాత అది 2016 జూలైలో జ్యూపిటర్ వద్దకు చేరుకున్నది. 2025 వరకు ఈ మిషన్ పనిచేయనున్నది.