Army Chief – Navy Chief : మన దేశ ఆర్మీ చరిత్రలో అరుదైన ఘట్టం ఒకటి చోటుచేసుకుంది. ఇద్దరు క్లాస్మేట్లు ఇండియన్ ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్లుగా నియమితులు అయ్యారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఇవాళ పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు చేపట్టనున్నారు. ఉపేంద్ర ద్వివేది మన దేశానికి 30వ ఆర్మీ చీఫ్ అవుతారు. రెండు నెలల క్రితమే భారత నావికా దళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి బాధ్యతలు స్వీకరించారు. ఉపేంద్ర ద్వివేది, దినేశ్ కుమార్ త్రిపాఠి 1970లో మధ్యప్రదేశ్లోని రేవా సైనిక్ స్కూల్లో 5వ తరగతి నుంచి కలిసి చదువుకున్నారు. ఈ ఇద్దరు మిత్రులు ఇప్పుడు ఇండియన్ ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్లుగా నియమితులయ్యారు. వీరిద్దరూ స్కూల్ డేస్ నుంచే మంచి ఫ్రెండ్స్. సైన్యంలో వివిధ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నప్పటికీ.. వారు ఎల్లప్పుడూ పరస్పరం టచ్లో ఉండేవారు. నేవీ చీఫ్గా దినేశ్ కుమార్ త్రిపాఠి బాధ్యతలు స్వీకరించిన రెండు నెలల వ్యవధిలోనే ఆర్మీ చీఫ్గా ఉపేంద్ర ద్వివేది(Army Chief – Navy Chief) నియమితులు కావడం గమనార్హం.
We’re now on WhatsApp. Click to Join
దినేశ్ కుమార్ త్రిపాఠి గురించి..
- భారత నావికాదళ చీఫ్ దినేశ్ కుమార్ త్రిపాఠి 1964 మే 15న జన్మించారు.
- ఆయన 1985 జులై 1న భారత నేవీ ఎగ్జిక్యూటివ్ విభాగంలో చేరారు.
- కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో దినేశ్ నిపుణుడిగా పేరుగాంచారు.
- ఐఎన్ఎస్ వినాశ్ను కమాండ్ చేసిన అనుభవం ఆయన సొంతం.
- ప్రఖ్యాత ఇండియన్ నావల్ అకాడమీకి కమాండంట్గానూ దినేశ్ సేవలందించారు.
- రేవాలోని సైనిక్ స్కూల్, ఖడక్వాస్లాలోని ఎన్డీయే పూర్వ విద్యార్థి అయిన త్రిపాఠి.. నావల్ వార్ కాలేజ్ గోవాతో పాటు యూఎస్ఏలోనూ వివిధ కోర్సులు పూర్తి చేశారు.
- అతి విశిష్ఠ్ సేవా మెడల్, నౌసేన మెడల్ పురస్కారాలను ఆయన అందుకున్నారు.
ఉపేంద్ర ద్వివేది గురించి..
- 1964 జూలై 1న ఉపేంద్ర ద్వివేది జన్మించారు.
- ఆయన రేవా సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థి.
- 1984 డిసెంబర్ 15న ఉపేంద్ర ద్వివేది భారత సైన్యంలో చేరారు.
- ద్వివేది నేషనల్ డిఫెన్స్ కాలేజీ, US ఆర్మీ వార్ కాలేజీ పూర్వ విద్యార్థి.
- ఆయన డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ (వెల్లింగ్టన్), ఆర్మీ వార్ కాలేజ్ (మోవ్)లలో కూడా కోర్సులు చేశారు.
- డిఫెన్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్లో ఎమ్ ఫిల్, స్ట్రాటజిక్ స్టడీస్ అండ్ మిలిటరీ సైన్స్లో రెండు మాస్టర్స్ డిగ్రీలు చేశారు.
- లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది 2022 నుంచి 2024 వరకు నార్తర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్గా పనిచేశారు.
- ఉపేంద్ర ద్వివేది పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, మూడు GOC-in-C కమెండేషన్ పురస్కారాలను పొందారు.