Biryani Orders in Warangal : వరంగల్ నగర వాసుల భోజన ప్రియత్వం 2025లో సరికొత్త రికార్డులను సృష్టించింది. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ ‘స్విగ్గీ’ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఓరుగల్లు నగరం రుచుల వేటలో తన ప్రత్యేకతను చాటుకుంది. ముఖ్యంగా చికెన్ బిర్యానీ పట్ల వరంగల్ ప్రజలకున్న మక్కువ అసాధారణంగా కనిపిస్తోంది. గడిచిన ఏడాదిలో ఏకంగా 4.46 లక్షల చికెన్ బిర్యానీ ఆర్డర్లు నమోదయ్యాయి అంటే, సగటున రోజుకు 1222 ప్లేట్లు ఖాళీ అయ్యాయన్నమాట. బిర్యానీతో పాటు వెజ్ దోస, ఇడ్లీ మరియు వెజ్ బిర్యానీలు కూడా నగరవాసుల టాప్-5 ఇష్టమైన వంటకాల జాబితాలో చేరి, వరంగల్ వైవిధ్యభరితమైన ఆహారపు అలవాట్లను ప్రతిబింబిస్తున్నాయి.
నగరంలో ఆహారపు ఆర్డర్ల గమనిస్తే, పార్టీ ప్రియులు మరియు అర్థరాత్రి భోజన ప్రియుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అర్థమవుతోంది. ఒక కస్టమర్ ఒకే ఆర్డర్లో ఏకంగా రూ. 13,778 విలువైన 37 ప్లేట్ల వివిధ రకాల బిర్యానీలు, ఫ్రైడ్ రైస్ మరియు స్టార్టర్లను ఆర్డర్ చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. అలాగే, అర్ధరాత్రి వేళల్లో (12 AM నుండి 2 AM వరకు) ఆర్డర్లు 118 శాతం వృద్ధి చెందడం గమనార్హం. ఈ సమయంలో చికెన్ షావర్మ, బర్గర్లు మరియు పిజ్జాల కంటే బిర్యానీకే జనం ఎక్కువగా ఓటు వేశారు. ఇక తీపి పదార్థాల విషయానికి వస్తే, డార్క్ చాక్లెట్ ఐస్ క్రీమ్ మరియు చాక్లెట్ కేకులు వరంగల్ వాసుల మనసు గెలుచుకున్నాయి.
ఉదయం వేళల్లో వరంగల్ నగరం సంప్రదాయ రుచులకే ప్రాధాన్యతనిచ్చింది. ప్రతిరోజూ 200 ప్లేట్లకు పైగా ఇడ్లీ ఆర్డర్లు స్విగ్గీ ద్వారా వెళ్లడం, దక్షిణాది అల్పాహారంపై ఉన్న మక్కువను తెలియజేస్తోంది. ఇడ్లీతో పాటు దోస, వడ, బోండాలు నగరవాసుల ఉదయపు ఇష్టమైన వంటకాలుగా నిలిచాయి. కేవలం ఖరీదైన హోటల్స్ మాత్రమే కాకుండా, ’99 స్టోర్’ వంటి సరసమైన ధరల్లో లభించే ఆప్షన్లకు కూడా విపరీతమైన ఆదరణ లభించింది. సాయంత్రం వేళల్లో కూడా చికెన్ బర్గర్లు, మంచూరియా వంటి స్నాక్స్ కంటే బిర్యానీ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపడం చూస్తుంటే, వరంగల్ అంటేనే బిర్యానీలకు అడ్డాగా మారిందని స్పష్టమవుతోంది.
