నేతి బొబ్బట్లు.. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడే తినే వంటల్లో ఈ రెసిపీ కూడా ఒకటి. అయితే చాలామందికి ఈ రెసిపీ ని ఎలా తయారు చేసుకోవాలో తెలియక బయట హోటల్స్ లో తెచ్చుకుని తింటూ ఉంటారు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయాలనే అనుకుంటున్నారా. అయితే ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు :
గోధుమ పిండి – ఒక కప్పు
శెనగ పప్పు – ముప్పావు కప్పు
నెయ్యి – అర కప్పు
బెల్లం తురుము – ముప్పావు కప్పు
యాలకుల పొడి – పావు టీ స్పూను
ఉప్పు – పావు టీస్పూను
నీళ్లు – సరిపడినన్ని
తయారీ విధానం
ముందుగా ఒక గిన్నెలో శెనగపప్పును నీళ్లుపోసి నానబెట్టుకోవాలి. ఒక గంట సేపు నానబెట్టాలి. ఇప్పుడు గోధుమపిండిని తీసుకుని ఉప్పు, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. చాలా మంది మైదా పిండిని వాడతారు. దీనివల్ల రుచిలో ఏమీ తేడా రాదు. చపాతీ పిండిలా కలిపేటప్పుడు అందులోనే నాలుగు స్పూన్ల నెయ్యి కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న శెనగపప్పును కుక్కర్లో వేసి కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. నీళ్లు వడకట్టేసి శెనగపప్పును మిక్సీజార్లో వేసి, బెల్లం తురుము కూడా వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేయాలి. అందులో మిక్సీలో రుబ్బుకున్న మిశ్రమాన్ని వేసి చిన్న మంట మీద కలుపుతూ ఉండాలి. అడుగు మాడకుండా కలుపుతూ ఉండాలి. యాలకుల పొడి కూడా కలపాలి. స్టవ్ కట్టేసి ఆ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చేతికి నెయ్యి రాసుకుని చపాతీ ముద్దని తీసుకుని పూరీలా ఒత్తాలి. మధ్యలో కాస్త శెనగపప్పు ముద్ద పెట్టి అన్ని వైపుల నుంచి మూసివేసి మళ్లీ ముద్దగా చుట్టుకోవాలి. ఇప్పుడు పాలిథీన్ కవర్ పై కాస్త నెయ్యి రాసి ఆ ముద్దను పూరీలా ఒత్తుకోవాలి. మరో వైపు స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యి రాయాలి. నెయ్యి వేడెక్కాక బొబ్బట్టును వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.