మనలో చాలామంది మష్రూమ్స్ లేదా పుట్టగొడుగులు తినడానికి అంతగా ఇష్టపడరు. కొంతమంది వీటిని ఇష్టంగా తింటే మరి కొంతమంది అవి కాస్త జిగురుగా ఉంటాయి అన్న కారణంగా వాటిని తినడానికి ఇష్టపడరు. అయితే వీటిని అమితంగా ఇష్టపడి తినేవారు వాటితో వెరైటీ వంటకాలను చేసుకోని తినాలని ట్రై చేస్తూ ఉంటారు. అటువంటి వారి కోసం ఈ రెమిడి. పుట్టగొడుగులతో ఎప్పుడైనా ఆమ్లెట్ తిన్నారా. ఒకవేళ తినక పోయి ఉంటే ఎలా తయారు చేసుకోవాలో అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మష్రూమ్స్ ఆమ్లెట్ కి కావలసిన పదార్థాలు:
పుట్టగొడుగులు – 5
గుడ్లు – 3
చిక్కటి పాలు – 2 టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి – కొద్దిగా
బటర్ – 1 టీ స్పూన్
చీజ్ తురుము – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత
నూనె – సరిపడా
కొత్తిమీర తురుము – గార్నిష్కి కొద్దిగా
తయారీ విధానం:
ముందుగా ఒక బౌల్లో గుడ్లు, ఉప్పు, పాలు, మిరియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత పెనంలో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడి కాగానే పుట్టగొడుగు ముక్కలు, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసుకుని గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి. పుట్టగొడుగు ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుని అదే పెనంలో కొద్దిగా నూనె, బటర్ వేసుకుని, బటర్ కరిగిన తర్వాత ఎగ్స్ మిశ్రమాన్ని ఆమ్లెట్లా వేసుకోవాలి. పైన చీజ్ తురుము వేసుకుని చిన్న మంట మీద ఉడకనివ్వాలి. అనంతరం పుట్టగొడుగుల మిశ్రమాన్ని ఆమ్లెట్కి మధ్యలో నిలువుగా పరచి,ఆమ్లెట్ని ఇటువైపు నుంచి అటు వైపు నుంచి ఫోల్డ్ చేసుకోవాలి. పైన కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్స్ ఆమ్లెట్ రెడీ.