Health Problems: గంటల కొద్దీ కూర్చుని ఉంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంటున్న తాజా సర్వేలు..

అమెరికాకు చెందిన ప్రముఖ వైద్య, ఆరోగ్య వెబ్‌సైట్‌ hopkinsmedicine.org ఇటీవల ఓ సర్వే చేసింది. దాని నుంచి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పడంతో పాటు..

గతంలో శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది. మారుతున్న టెక్నాలజీతో శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది. హాయిగా ఏసీ గదుల్లో సౌకర్యవంతమైన కుర్చీల్లో కూర్చుని ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా కంటిన్యూగా ల్యాప్‌టాప్‌ లేదా మానిటర్‌ స్కీన్‌నే చూస్తూ ఉండిపోతున్నారు. పని మధ్యలో ఎలాంటి చిన్న బ్రేక్‌ లేకుండా కనీసం పక్కకు కూడా కదలకుండా గంటలపాటు అలా కూర్చోవడం వల్ల వాళ్ల ఆరోగ్యంపై (Health) తీవ్ర ప్రభావం చూపుతుంది. భవిష్యత్తులో వీరు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటారని తాజా సర్వే చెబుతోంది.

అమెరికా సంస్థ సర్వే:

అమెరికాకు చెందిన ప్రముఖ వైద్య, ఆరోగ్య వెబ్‌సైట్‌ hopkinsmedicine.org ఇటీవల ఓ సర్వే చేసింది. దాని నుంచి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పడంతో పాటు భయంకరమైన నిజాలు కూడా చెప్పింది. 1950 నుంచి 2023 వరకు పోల్చి చూసుకుంటే కూర్చుని చూసే ఉద్యోగాల సంఖ్య 83% పెరిగినట్లు తన నివేదికలో పేర్కొంది. డిజిటల్‌ యుగంలో ‘ది సిట్టింగ్‌ డిసీజ్‌’ అనేది పెద్ద సమస్యగా మారబోతుందని, దీని వల్ల భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య (Health) సమస్యలు వస్తాయని చెప్పింది. ప్రధానంగా అయిదు సమస్యలు వస్తాయని వివరించింది.

వెన్ను లేదా మెడ నొప్పి:

రోజూ ఏడు, ఎనిమిది గంటలపాటు ఒకేచోట కూర్చుని డిజిటల్‌ స్ర్కీన్‌లు చూడటం వల్ల మెడ, వెన్నుముక, వీపుభాగం, నరాలు, స్నాయువు మీద తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల మెడ లేదా వెన్నులో తీవ్రమైన నొప్పి వస్తుంది. స్పాండిలైటిస్‌ వంటివాటికి కారణం అవుతుంది.

దీర్ఘకాలిక సమస్యలు:

రోజంతా కూర్చునే చేయాల్సిన జాబ్‌ అయితే మీరు ఏ విధంగా కూర్చున్నారనేది కూడా చాలా ముఖ్యం. వెన్నెముక నిటారుగా ఉండి, పనిచేసే మానిటర్‌ మీ ముఖానికి ఎదురుగా ఉంటే పర్వాలేదు. అలా కాకుండా పక్కకు ఒదిగిపోయి లేదా వంగిపోయి కూర్చున్నా, భుజాలు జారిపోయినట్లు ఉన్నా ఇబ్బందే. దీని వల్ల శరీరంలో ఏ అవయవంపై అయితే ఎక్కువ ఒత్తిడి ఉంటుందో అక్కడ తీవ్రమైన నొప్పి వస్తుంది. వెన్నెముక డిస్క్‌లపై ప్రభావం చూపడంతో పాటు దీర్ఘకాలిక నొప్పికి కారణం అవుతుంది.

రోజంతా అలసటగా:

సుదీర్ఘ సమయం కూర్చోవడంతో మీ శరీరం, మెదడు చాలా త్వరగా అలిసిపోతుంది. అది మీ పని, దినచర్యపై ప్రభావం చూపుతుంది. రోజంతా అలసటగా అనిపిస్తుంది. ఉత్సాహంగా పనులు చేయలేరు.

బరువు పెరగడం:

కంటిన్యూగా కూర్చున్నప్పుడు శరీరానికి అవసరమైన లైపోప్రొటీన్‌ లైపేస్‌ వంటి అణువులు విడుదల కావు. దీంతో బరువు పెరగడంతో పాటు ఊబకాయం వంటి వ్యాధులకు కారణం అవుతుంది. దీని వల్ల ఇతర ఆరోగ్య (Health) సమస్యలు కూడా వస్తాయి.

ఆందోళన:

ఎటువంటి శారీరక శ్రమ లేకుండా ఎక్కువ గంటలు కూర్చోవడంతో త్వరగా ఒత్తిడికి గురవుతారు. ఆందోళన పెరగడం వల్ల బీపీ, మధు మేహం, గుండెపోటు వంటి తీవ్ర ప్రమాదాలకు కారణం అవుతుంది. మీ జీవిత కాలాన్ని తగ్గిస్తుంది.

ఇలా చేయండి:

ఈ సమస్యల నుంచి తప్పించుకునేందుకు కొన్ని నియమాలు పాటించాలని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ వారు చెబుతున్నారు. రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. పని సమయంలో గంటకు అయిదు నిమిషాలు బ్రేక్‌ తీసుకోమని సూచిస్తున్నారు. ఇంట్లో లేదా బయట నడవమంటున్నారు.

Also Read:  Rohit Sharma: సాగర తీరాన వన్డే సమరం