రాగి పాత్రలను(Copper Vessels) ఉపయోగించడం మన ఆరోగ్యానికి మంచిది అని అందరికీ తెలుసు. అందుకే ఈ మధ్యకాలంలో అందరూ రాగి గ్లాసులు, రాగి వాటర్ బాటిల్స్(Copper Water Bottles) ఎక్కువగా వాడుతున్నారు. ఇంకా రాగి పూతతో చేసిన వంట పాత్రలను, దేవుడి గదిలో ఉపయోగించే సామాగ్రి ని రాగితో చేసిన వాటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ అవి తొందరగా రంగు పోయి నల్లగా కనబడుతుంటాయి. కాబట్టి వాటిని ఎప్పుడూ కొత్తవాటిలా మెరిసేదానిలా ఉంచడానికి కొన్ని చిట్కాలను పాటించవచ్చు.
ఉప్పు, వెనిగర్ ను ఉపయోగించి రాగి సామాన్ల నలుపుదనాన్ని పోగొట్టవచ్చు. ఉప్పు,వెనిగర్ ల మిశ్రమాన్ని కలిపి గట్టిగా రాగి సామాన్ల పైన రుద్దాలి అప్పుడు రాగి పాత్రలపైన ఉన్న మురికి తొలగిపోతుంది. ఇంకోవిధంగా ఒక చెంచా ఉప్పు, వెనిగర్ ఒక కప్పు ను ఒక గిన్నెడు నీళ్ళల్లో వేసి బాగా కలపాలి. దానిలో రాగి సామాన్లను వేసి స్టవ్ మీద పెట్టాలి. నీళ్లు మరిగేవరకు ఉంచి ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లారిన తరువాత రాగి పాత్రలను తీసి వేడి నీటితో కడగాలి. పొడి గుడ్డతో తడి లేకుండా రాగి పాత్రలను తుడిచి పెట్టుకోవాలి. ఇలా చేస్తే రాగి పాత్రలు కొత్తవాటిలా మెరుస్తాయి.
రోజూ ఉపయోగించే రాగి పాత్రలను రోజూ వాటిని తోమేటప్పుడు కొద్దిగ ఉప్పు, కొద్దిగ చింతపండు కలిపి తోమాలి కాసేపు వాటిని అలాగే ఉంచి తరువాత సబ్బుతో కడగాలి. ఇలా చేసినా రాగి పాత్రలు మెరుస్తాయి. నిమ్మకాయతో రాగి పాత్రలను కడిగిన అవి కొత్తవాటిలా మెరుస్తాయి. నిమ్మకాయ రసాన్ని ఒక గిన్నెలో పిండుకొని దానిలో కొద్దిగ ఉప్పు వేసి బాగా కలపాలి. దానిలో ఒక కాటన్ వస్త్రాన్ని ముంచి దానితో రాగి పాత్రలను తుడిస్తే తొందరగా మెరుస్తాయి.
కెచప్ ను కొద్ది కొద్దిగ తీసుకొని రాగి పాత్రల పైన పూతలాగా పూయాలి. ఒక పది నిముషాల తరువాత రాగి పాత్రలను ఒక క్లాత్ తో గట్టిగా రుద్దాలి. ఆ తరువాత వేడి నీటితో శుభ్రంగా కడగాలి. తరువాత పొడి గుడ్డతో రాగి పాత్రలను తుడవాలి. అప్పుడు రాగి పాత్రలు తళతళ మెరుస్తాయి. ఈ విధంగా మనం మన ఇంటిలో వాడే రాగి పాత్రలను ఎప్పుడూ కొత్త వాటిలా మెరిసేలా ఉంచుకోవచ్చు.
Also Read : Sugarcane: వేసవిలో చెరుకు రసం తాగితే ఏం జరుగుతుందో తెలుసా?