Amoeba Attack: మెదడును తినే అమీబా ఎటాక్.. ఒక వ్యక్తి మృతి.. ఎందుకు? ఎలా?

నెగ్లేరియా ఫాలెరీ..మనిషి మెదడును తినేసే అమీబా. దీని కారణంగా అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న షార్లోట్ కౌంటీకి చెందిన ఒక వ్యక్తి మరణించాడు.

నెగ్లేరియా ఫాలెరీ.. మనిషి మెదడును తినేసే అమీబా (Amoeba). దీని కారణంగా అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న షార్లోట్ కౌంటీకి చెందిన ఒక వ్యక్తి మరణించాడు. ఫిబ్రవరి 23న నెగ్లేరియా ఫాలెరి ఇన్ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరిన ఆ వ్యక్తి.. మార్చి 2న చనిపోయినట్లు ప్రకటించారు. వివిధ ప్రభుత్వ సంస్థలకు చెందిన అధికారులు ఈ మృతిపై దర్యాప్తు చేస్తున్నారని.. ఈ ఇన్ఫెక్షన్ ఎలా సోకిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఫ్లోరిడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ ప్రతినిధి జే విలియమ్స్ చెప్పారు.అమెరికాలో ఏటా సగటున ముగ్గురు ఈ వ్యాధి బారిన పడుతుంటారని, వారంతా ప్రాణాంతక పరిస్థితులను ఎదుర్కొంటుంటారని సీడీసీ గణాంకాలు చెప్తున్నాయి.1962 నుంచి 2021 మధ్య అమెరికాలో 154 మందికి ఇది సోకగా వారిలో కేవలం నలుగురు మాత్రమే బతికారు.

ప్రైమరీ అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్

నల్లా నీటి వల్ల ముక్కు ద్వారా ఈ అమీబా (Amoeba) మెదడుకు చేరి ఇన్ఫెక్షన్ సోకడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు. ట్యాప్ వాటర్‌తో తన సైనస్‌ను కడిగే ప్రయత్నం చేయగా.. నీటిలోని మెదడు తినే అమీబా అతని మెదడులోకి వెళ్లినట్టు ఫ్లోరిడా డిపార్ట్‌మెంట్ ఆరోగ్య అధికారులు వెల్లడించారు. బ్రెయిన్ టిష్యూను ఈ అమీబా నాశనం చేయడం వల్లే చనిపోయాడని అంటున్నారు. నెగ్లేరియా ఫోలెరి అమీబా సాధారణంగా వేడి నీరు ఉండే నీటి నిల్వల్లో, సరస్సుల్లో, కొలనుల్లో ఉంటుంది. ఇది ఉండే నీటితో ముక్కు, సైనస్‌ను శుభ్రం చేసేటప్పుడు ఎక్కువగా ఇది మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది.

ఈ అమీబా (Amoeba) సోకితే తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వాంతులు, మాటలు అస్పష్టంగా మారడం, మెడ దాని దృఢత్వాన్ని కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ అమీబా వల్ల ఇన్ఫెక్షన్ సోకినవారికి ప్రైమరీ అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ అనే వ్యాధి సోకుతుంది.సురక్షితం కాని నీటితో ముక్కు రంథ్రాలు శుభ్రం చేయరాదని, మరిగించిన నీరు వాడాలని అధికారులు సూచిస్తున్నారు.స్విమింగ్ పూల్స్‌లో దిగేటప్పుడు ఆ నీరు ముక్కులోకి వెళ్లకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

Also Read:  WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్స్.. ‘పుష్ నేమ్’, గ్రూప్స్ కు ఎక్స్ పరీ డేట్