EVM Vs Akhilesh Yadav : సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ లోక్సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలపై తనకు ఎప్పుడూ నమ్మకం లేదని స్పష్టం చేశారు. తమ పార్టీకి 80కి 80 సీట్లు వచ్చినా ఆ నమ్మకం కుదరదని అఖిలేష్ తేల్చి చెప్పారు. ఈవీఎంల సమస్య ఇంకా అలాగే ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ఎన్నికల టైంలో 400 సీట్లు వస్తాయని అధికార పక్షం వాళ్లు ప్రచారం చేసుకున్నారు. కానీ ప్రజలు మాకు నైతిక విజయాన్ని అందించారు. ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువకాలం ఉండదని అంతా అనుకుంటున్నారు. వ్యక్తిగత లక్ష్యాల ఆధారంగా ఎవరూ దేశాన్ని నడిపించలేరు’’ అని ఎన్డీయే సర్కారుపై అఖిలేష్(EVM Vs Akhilesh Yadav) విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరుగుతున్న చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join
అయోధ్యలో బీజేపీకి ఎదురైన ఓటమి అనేది పరిణతి సాధించిన ఓటర్ల వల్ల లభించిన విజయమని అఖిలేష్ యాదవ్ కామెంట్ చేశారు. చిన్నపాటి వర్షాలకే అయోధ్య రామమందిరంలో జరుగుతున్న లీకేజీలు అనేవి జరిగిన అవినీతి లీలలకు నిదర్శనమని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లో అభివృద్ధి పేరిట అవినీతి జరుగుతోందని ఆయన అన్నారు. ఒకప్పుడు తాము నిర్మించిన రోడ్లపై విమానాలు దిగాయని అఖిలేష్ గుర్తు చేశారు. ఇప్పుడు లక్నోలో పడవలపై తిరిగేంత అధ్వానంగా వర్షాలకు రోడ్లు ధ్వంసమయ్యాయని చెప్పారు. నగరాల్లో ఇంత దుస్థితి ఉన్నా.. సిటీలకు స్మార్ట్ సిటీ పేరు పెట్టి పిలుస్తుండటం విడ్డూరంగా ఉందని అఖిలేష్ ఎద్దేవా చేశారు. కులగణనకు తాము అనుకూలం అని స్పష్టం చేశారు. అగ్నివీర్ స్కీమ్ను అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. దానిని రద్దు చేస్తామని ఆయన వెల్లడించారు. ‘‘అసలు పేపర్ లీక్లు ఎందుకు జరుగుతున్నాయి? యువతకు ఉద్యోగాలు ఇవ్వొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు ఒడిగడుతోంది’’ అని అఖిలేష్ ఆరోపించారు.
లోక్సభలో తాను చేసిన ప్రసంగంలో నుంచి కొన్ని వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘మోడీ ప్రపంచంలో నిజాలను చెరిపేస్తారు. కానీ వాస్తవ ప్రపంచంలో అది సాధ్యం కాదు. నేను చెప్పాలనుకున్న నిజం చెప్పాను. వారు కావాలంటే అంతా తొలగించుకున్నా పర్వాలేదు. నిజం ఎప్పటికీ నిజమే’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.