ఈమధ్యే లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే భారత ఆర్మీ నూతన చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సైన్యం వైఖరిని స్పష్టంగా చెప్పారు. ఇండో-చైనా సరిహద్దుల్లో ఒక అంగుళం భూభాగాన్ని కూడా వదులుకునే ప్రసక్తే లేదన్నారు. భారత్ -చైనా సరిహద్దుల్లో ఇప్పుడున్న పరిస్థితిని మార్చడానికి ఏమాత్రం అంగీకరించమన్నారు. తమ వైఖరి ఇదేనని స్పష్టం చేశారు. ప్రస్తుత వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని లెఫ్టినెంట్ జనరల్ వెల్లడించారు.
ఇక తమ సన్నద్ధత గురించి మాట్లాడుతూ..చైనాతో సరిహదుల్లో అదనపు వ్యవస్థలు, బలగాలను మోహరించామని చెప్పారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించినట్లు వివరించారు. ఇక రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్నది సంప్రదాయ యుద్ధమని అభిప్రాయపడ్డారు. భారత్ విషయానికొస్తే…దేశీయంగా తయారైన ఆయుధ వ్యవస్థలను డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.