Drone Attack : గుజరాత్ తీరానికి వస్తున్న ఇజ్రాయెలీ నౌకపై అరేబియా సముద్రంలో జరిగిన డ్రోన్ దాడి ఘటనపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘాటుగా స్పందించారు. ఈ దాడికి పాల్పడిన వాళ్లు సముద్ర గర్భంలో దాక్కున్నా వెలికితీసి తీరుతామని ఆయన వెల్లడించారు. అరేబియా సముద్రంలో ఎంవీ కెమ్ ప్లూటో నౌకపై , ఎర్ర సముద్రంలో ఎంవీ సాయిబాబా నౌకపై జరిగిన డ్రోన్ దాడులను(Drone Attack) భారత ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని తెలిపారు. ఇప్పుడు తీర ప్రాంతాల్లో భారత నౌకాదళం నిఘాను ముమ్మరం చేసిందని రాజ్నాథ్ చెప్పారు. ఈ నౌకలపై దాడిచేసిన వారిని గుర్తించి న్యాయస్థానం ఎదుట నిలబెట్టి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రతకు భారత్ తొలి ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ఈవిషయంలో మిత్రదేశాలతో ఇండియా కలిసి పనిచేస్తుందన్నారు. అధునాతన స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్ ‘INS ఇంఫాల్’ను మంగళవారం ముంబైలో నౌకాదళానికి రాజ్నాథ్ అప్పగించారు. స్వదేశీ టెక్నాలజీతో భారత్ తయారు చేయనున్న నాలుగు ‘INS ఇంఫాల్’ స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్లలో ఇది మూడోది.
We’re now on WhatsApp. Click to Join.
ఇటీవల లైబీరియా జెండాతో కూడిన ముడి చమురు నౌక ‘MV కెమ్ ప్లూటో’ సౌదీ అరేబియా నుంచి కర్ణాటకలోని మంగళూరుకు బయలుదేరింది. ఈక్రమంలోనే మార్గం మధ్యలో గుజరాత్ తీరం వద్ద దానిపై డ్రోన్ స్ట్రైక్ జరిగింది. దీంతో నౌకలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన చోటుచేసుకున్న టైంలో నౌకలో 21 మంది సిబ్బంది, ఒక వియత్నామీస్ జాతీయుడు ఉన్నారు. వెంటనే భారత నేవీ తమ రెస్క్యూ టీమ్ను ‘MV కెమ్ ప్లూటో’ నౌక వద్దకు పంపింది. అది వెళ్లి మంటలను ఆర్పేసి.. ‘MV కెమ్ ప్లూటో’ నౌకను గుజరాత్ తీరానికి తీసుకొచ్చింది. ఈ డ్రోన్ దాడి ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. నౌకలోని కొంతభాగం మాత్రం దెబ్బతింది.