Sagarika Ghose : ప్రముఖ పాత్రికేయుడు రాజ్దీప్ సర్దేశాయ్ సతీమణి, జర్నలిస్టు సాగరికా ఘోష్ను పశ్చిమ బెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది. ప్రఖ్యాత మీడియా సంస్థల్లో పనిచేసిన సాగరిక జర్నలిజంలో అనేక అవార్డులను సాధించారు. పలు పుస్తకాలను రచించారు. సాగరిక జర్నలిస్టుగా చాలా సంవత్సరాలు పనిచేశారు. ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ఔట్లుక్, ది ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి పెద్ద పెద్ద వార్తా సంస్థల్లో ఘోష్ పనిచేశారు. ప్రధాని మోడీపై, ప్రభుత్వ విధానాలపై ఆమె తీవ్రమైన విమర్శలు చేస్తుంటారు. ఇటువంటి నేపథ్యం కలిగిన సాగరికా ఘోష్ను రాజ్యసభకు పంపాలని మమతా బెనర్జీ డిసైడ్ చేయడం గమనార్హం. ఈ పరిణామం ఎఫెక్టు బెంగాల్ రాజకీయాలపైనా పడుతుందని అంచనా వేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతోంది.
We’re now on WhatsApp. Click to Join
భారతీయుల హక్కుల కోసమే ఈ నిర్ణయం : టీఎంసీ
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టు సాగరిక ఘోష్తో పాటు సుస్మితా దేవ్, మహ్మద్ నదీముల్ హక్, మమతా ఠాకూర్లను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘‘రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థులుగా సాగరిక ఘోష్(Sagarika Ghose), సుస్మితా దేవ్, మహ్మద్ నదిముల్ హక్, మమతా ఠాకూర్లను ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాం. వారందరికీ శుభాకాంక్షలు. తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఎన్నికైన వీరంతా భారతీయుల హక్కుల కోసం వాదించే మా పార్టీ వారసత్వాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తారని ఆశిస్తున్నాం’’ అని టీఎంసీ పేర్కొంది. ఈ ట్వీట్ను సాగరికా ఘోష్ రీట్వీట్ కూడా చేశారు.
56 రాజ్యసభ స్థానాల భర్తీ..
దేశవ్యాప్తంగా ఏప్రిల్లో ఖాళీ కానున్న 56 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసింది. బెంగాల్లో మొత్తం 5 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8వ తేదీ నుంచే రాజ్యసభ ఎన్నిలకు నామినేషన్ల స్వీకరణ మొదలైంది. దరఖాస్తుల సమర్పణకు లాస్ట్ డేట్ ఫిబ్రవరి 15. ఫిబ్రవరి 27న రాజ్యసభ పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.