భారత సైన్యం అమ్ములపొదిలో ఉన్న బ్రహ్మాస్త్రం “బ్రహ్మోస్” క్షిపణి.
ఇదొక సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి..
ఇప్పటికే భూమి నుంచి గగన తలానికి ప్రయోగించే, గగన తలం నుంచి భూమి వైపు ప్రయోగించే రెండు విభిన్న బ్రహ్మోస్
వేరియంట్లు ఉన్నాయి.
త్వరలోనే భారత సైన్యానికి మరో విభిన్న బ్రహ్మోస్ వేరియంట్ అందనుంది. దానిపేరే.. డ్యూయల్ రోల్ కేపబుల్ బ్రహ్మోస్ మిస్సైల్. దీని ప్రత్యేకత ఏమిటంటే.. భూమి నుంచి గగన తలానికి, గగన తలం నుంచి భూమికి, భూమి నుంచి భూమికి, గగన తలం నుంచి గగన తలాన్ని టార్గెట్ చేయగలదు. దీనికి సంబంధించి భారత రక్షణ శాఖ, బ్రహ్మోస్ ఏరో స్పేస్ కంపెనీ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ అగ్రిమెంట్ విలువ దాదాపు రూ.1700 కోట్లు. డ్యూయల్ రోల్ కేపబుల్ బ్రహ్మోస్ మిస్సైల్స్ ను తొలుత నౌకా దళంలోకి ప్రవేశ పెట్టాలని భారత రక్షణ శాఖ భావిస్తోంది. ఆత్మ నిర్బర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ అడ్వాన్స్డ్ మిస్సైల్స్ ను బ్రహ్మోస్ కంపెనీ ఇండియాలోనే తయారు చేయనుంది.బ్రహ్మోస్ అనేది ఇండియా కు చెందిన డీఆర్డీవో , రష్యాకు చెందిన బ్రహ్మోస్ కంపెనీలు కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ సంస్థ.
బ్రహ్మోస్ క్షిపణి ప్రత్యేకత ఏమిటి?
ఇండో రష్యన్ జాయింట్ వెంచర్ ‘బ్రహ్మోస్ ఏరోస్పేస్’ సబ్మెరైన్లు, నౌకలు, విమానాలు లేదా భూ ఆధారిత ప్లాట్ఫారమ్ల నుండి ప్రయోగించగల సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఉత్పత్తి చేస్తుంది. బ్రహ్మోస్ క్షిపణులు మాక్ 2.8 లేదా ధ్వని కంటే దాదాపు మూడు రెట్లు వేగంతో ప్రయోగించగలవు. బ్రహ్మోస్ క్షిపణి యొక్క ఖచ్చితత్వం దానిని మరింత ప్రాణాంతకం చేస్తుంది. దీని పరిధిని కూడా పెంచుకోవచ్చు. ఇది కాకుండా, ఈ క్షిపణి శత్రు రాడార్ నుండి తప్పించుకోవడంలో కూడా ప్రవీణమైనది.బ్రహ్మోస్లో బ్రహ్మ అంటే ‘బ్రహ్మపుత్ర’ మోస్ అంటే ‘మోస్క్వా’. రష్యాలో ప్రవహించే నది పేరు మోస్క్వా. సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి అయిన బ్రహ్మోస్ 21వ శతాబ్దపు అత్యంత ప్రమాదకరమైన క్షిపణులలో ఒకటి. ఈ క్షిపణి గంటకు 4300 కి.మీ వేగంతో శత్రు స్థానాలను ధ్వంసం చేయగలదు. ఇది 400 కి.మీ పరిధిలో శత్రువులను టార్గెట్ చేయగలదు.బ్రహ్మోస్ క్షిపణులు ధ్వని కంటే దాదాపు మూడు రెట్ల అధిక వేగంతో దూసుకెళ్లగలవు.
బ్రహ్మోస్ , సుఖోయ్-30ఎంకేఐ కలిస్తే..
బ్రహ్మోస్ మిస్సైల్, సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానం కలిస్తే తిరుగు ఉండదు. సుఖోయ్ యుద్ధ విమానం నుంచి సుదూర ప్రాంతాల్లోని భూతల, సముద్ర లక్ష్యాలపైకి బ్రహ్మోస్ మిస్సైల్ తో కచ్చితమైన దాడులు చేయొచ్చు.