3 Temples : అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి మహారాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశీ, మథురలను శాంతియుతంగా అప్పగిస్తే.. విదేశీ ఆక్రమణదారులు ధ్వంసం చేసిన ఇతర దేవాలయాల సమస్యలను హిందూ సమాజం మరచిపోతుందన్నారు. విదేశీయుల దాడుల్లో 3,500 హిందూ దేవాలయాలు నేలమట్టమయ్యాయని గోవింద్ దేవ్ గిరి మహారాజ్ తెలిపారు. మహారాష్ట్రలోని పూణే సమీపంలో ఉన్న అలందిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ కామెంట్స్ చేశారు. గోవింద్ దేవ్ గిరి మహారాజ్ 75వ జన్మదిన వేడుకల్లో భాగంగా ఫిబ్రవరి 4 నుంచి 11 వరకూ అలందిలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ సహా ఇతర ప్రముఖులు హాజరవుతున్నారు.
‘‘మూడు దేవాలయాలకు విముక్తి లభిస్తే మేం ఇక ఇతరుల వైపు చూడాలని కూడా కోరుకోం.. ఎందుకంటే మనం గతంలో కాకుండా భవిష్యత్తులో జీవించాలని భావిస్తున్నాం.. దేశ భవిష్యత్తు బాగుండాలి.. అందుకే మిగిలిన రెండు దేవాలయాలను (కాశీ, మధుర) శాంతియుతంగా ప్రేమతో మాకు అప్పగిస్తే మిగతా విషయాలన్నీ మరచిపోతాం’’ అని గోవింద్ దేవ్ గిరి మహారాజ్ వ్యాఖ్యానించారు. ‘‘శాంతియుత పరిష్కారం కోసం నేను చేస్తున్న ఈ డిమాండ్కు ముస్లిం సమాజం మద్దతు తెలపాలి. కేవలం దాడులకు సంబంధించిన ఆనవాళ్లను తొలగించడమే సమస్య. దీన్ని రెండు వర్గాల మధ్య సమస్యగా భావించరాదు’’ అని ఆయన పేర్కొన్నారు.
‘‘అయోధ్య రామమందిర వివాదానికి మనం శాంతియుత పరిష్కారాన్ని కనుగొన్నాం.. అదే స్ఫూర్తితో ఇతర వివాదాలను(3 Temples) కూడా శాంతియుతంగా పరిష్కారం లభిస్తుందని మేం ఆశిస్తున్నాం’’ అని గోవింద్ దేవ్ గిరి మహారాజ్ తెలిపారు. ‘‘ మిగిలిన రెండు దేవాలయాల కోసం శాంతియుత పరిష్కారానికి ముస్లిం సమాజంలోని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అయితే కొందరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు’’ అని చెప్పారు. ‘‘మేము పరిస్థితిని బట్టి ఒక స్టాండ్ తీసుకుంటాం.. వారిని ఒప్పించడానికి ప్రయత్నిస్తాం. ఎలాంటి అశాంతియుత వాతావరణం ఏర్పడకుండా చూస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు.
అయోధ్య రామయ్యను తొలిసారిగా ఓ విదేశీ నేత దర్శించుకోనున్నారు. శ్రీరాముడి దర్శనం కోసం ఫిజీ ఉప ప్రధాని బిమన్ ప్రసాద్ ఈ నెల 8న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు విచ్చేయనున్నారు. ఈవిషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ‘‘అధికారిక పర్యటన నిమిత్తం ఫిజీ డిప్యూటీ పీఎం బిమన్ ప్రసాద్ ఆదివారం అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం. బిమన్ పర్యటన భారత్-ఫిజీ సంబంధాలను బలోపేతం చేస్తుంది’’ అని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. బిమన్ ప్రసాద్ వారం రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చారు. ఆదివారం అర్ధరాత్రి న్యూఢిల్లీకి చేరుకున్న బిమన్కు(Fiji Deputy PM) విదేశీ వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ పరిమిత త్రిపాఠి స్వాగతం పలికారు.