ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరుగుతోంది. ప్రధాన నరేంద్ర మోడీ ఓటు వేసిన తరువాత పలువురు ఎంపీలు ఓటువేసేందుకు పార్లమెంట్లో క్యూ కట్టారు. ఎన్డీయే అభ్యర్థి ధంఖర్ విజయం లాంఛనంగా కనిపిస్తోంది. విపక్షాల అభ్యర్థిగా బరిలోకి దిగిన మార్గరేట్ అల్వా కు మద్ధతు ఇవ్వడానికి టీఎంసీ నిరాకరించింది. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండేలా మమత నిర్ణయం తీసుకున్నారు. అయితే, అల్వాకు మద్ధతుగా టీఆర్ఎస్ పార్టీ నిలిచింది. అయినప్పటికీ ఆమెకు 200 ఓట్లు మించి రావని అంచనా వేస్తున్నారు. విపక్షాల్లోని అనైక్యత ఉప రాష్ట్రపతి ఎన్నికల ద్వారా మరోసారి బయటపడింది. దీంతో ఎన్టీయే అభ్యర్థి భారీ మోజార్టీతో గెలుపొందేందుకు మార్గం సుగమం అయింది.
పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ ధంఖర్ సులభంగా విజయాన్ని అందుకోనున్నారు. 71 ఏళ్ల ధంఖర్ సోషలిస్ట్ నేపథ్యం కలిగిన రాజస్థాన్కు చెందిన జాట్ నాయకుడు. ఇక 80 ఏళ్ల అల్వా కాంగ్రెస్ సీనియర్ లీడర్, రాజస్థాన్ , ఉత్తరాఖండ్ గవర్నర్గా పనిచేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ , జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM), తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) మద్దతు పొందారు. AIMIM కూడా అల్వాకు తన మద్దతును అందించింది. అయితే, జనతాదళ్ (యునైటెడ్), వైఎస్ఆర్సిపి, బిఎస్పి, ఎఐఎడిఎంకె, శివసేనలతో పాటు కొన్ని ప్రాంతీయ పార్టీల మద్దతు ఇస్తున్నాయి. ఎన్డిఎ అభ్యర్థి 515 ఓట్లకు పైగా పొందే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అల్వా అభ్యర్థిత్వానికి మద్ధతు ప్రకటించిన పార్టీల ఎంపీల సంఖ్య ప్రకారం ఆమెకు సుమారు 200 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. లోక్సభలో 23 మంది, రాజ్యసభలో 16 మంది ఎంపీలు ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.
అల్వాకు మద్దతు ఇస్తున్న ప్రతిపక్ష ఎంపీలందరికీ కృతజ్ఞతలు తెలిపేందుకు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే గురువారం రాత్రి విందు ఇచ్చిన విషయం విదితమే. మరోవైపు శుక్రవారం బీజేపీ ఎంపీలతో ధంఖర్ భేటీ అయ్యారు. ఎన్నికలకు మద్దతు కోరుతూ పార్టీ ఎంపీలను కలుస్తూనే ఉన్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత వెంటనే ఓట్ల లెక్కింపు చేసి సాయంత్రంలోగా రిటర్నింగ్ అధికారి తదుపరి ఉపాధ్యక్షుడి పేరును ప్రకటిస్తారు.
నామినేటెడ్ సభ్యులతో సహా లోక్సభ , రాజ్యసభ సభ్యులు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులు.ప్రస్తుత ఎం వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగుస్తుంది. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్పర్సన్గా కూడా ఉంటారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల ఎలక్టోరల్ కాలేజీలో పార్లమెంటు ఉభయ సభల్లోని మొత్తం 788 మంది సభ్యులు ఉంటారు. ఎలక్టర్లందరూ పార్లమెంటు ఉభయ సభల సభ్యులు కాబట్టి, ప్రతి ఎంపీ ఓటు విలువ ఒకే విధంగా ఉంటుంది. ఎన్నికలలో ఓటింగ్ రహస్య బ్యాలెట్ ద్వారా జరుగుతుంది. ఈ విషయంలో పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేయలేవని ఈసీ హెచ్చరించింది. పార్లమెంట్ హౌస్లో ఓటింగ్ ఏర్పాట్లు చేయడంతో ఎంపీలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూ కట్టారు.