Site icon HashtagU Telugu

Owaisi In UP : ఇద్దరు సిఎంల ఎజెండాతో ‘ఎంఐఎం’ కూటమి

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విచిత్ర కూటమితో పాటు ఆశ్చర్యం కలిగించే ఒప్పందానికి ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) తెరలేపింది . కూటమి అధికారంలోకి వస్తే ఇద్దరు ముఖ్యమంత్రులు, ముగ్గురు డిప్యూటీ సిఎం లు ఉండేలా సంచలన ఒప్పందం కుదిరింది. ఆ మేరకు వివరాలను ఎం ఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ శనివారం వెల్లడించాడు. ఉత్తరప్రదేశ్‌లో బాబు సింగ్ కుష్వాహా, భారత్ ముక్తి మోర్చాతో పొత్తును ప్రకటించారు.కూటమి అధికారంలోకి వస్తే ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారని, ఒకరు ఓబీసీ, మరొకరు దళితులు, ముస్లింలు సహా ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని విలేకరుల సమావేశంలో వెల్లడించాడు.
ఇది బలవంతం వల్ల ఏర్పడిన కూటమి కాదా అని ప్రశ్నించగా, ఇది బలవంతం కాదని బాబు సింగ్ కుష్వాహ అన్నారు. దళితులు, వెనుకబడిన, మైనారిటీల కోసం సుదీర్ఘకాలం పాటు పనిచేశాం అని చెప్పాడు. ఉత్తరప్రదేశ్‌లోని 403 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇద్దరు సిఎం లు ఉండేలా జరిగిన ఒప్పందంపై పలు రకాలుగా కామెంట్స్ వస్తున్నాయి. రాబోవు రోజుల్లో తెలుగు రాష్టాల్లో కూడా ఇలా చూస్తామా అనే అనుమానం ఒవైసీ ఆలోచనను గమనిస్తే అర్ధం అవుతుంది.