పంటలు ఎంత బాగా పండితే ఆదాయం అంత ఎక్కువగా వస్తుందని పాతకాలం రైతులు ఇప్పటికీ నమ్ముతుంటారు. కానీ అందుకు విరుద్ధంగా నష్టాలు వస్తుండడం వారిలో ఆందోళన కలిగిస్తోంది.స్లపయి పెరిగితే ధరలు తగ్గుతాయన్నది ఆధునిక ఆర్థిక శాస్త్ర సూత్రం. పంటలకూ ఇదే వర్తిస్తోంది. ఇబ్బడి ముబ్బడిగా పంట పండినప్పడు ధరలు తగ్గి నష్టాలు మిగులుస్తున్నాయి.ఉత్తరప్రదేశ్లో ఇప్పడు ఇదే జరుగుతోంది. ఇదొక ఎన్నికల అంశంగా మారింది. రాష్ట్రంలో వరి విపరీతంగా పండింది. ఇది రెండు సమస్యలను తెచ్చి పెట్టింది. ఒకటి ధరలు పడిపోయాయి. రెండు ఇంత పంటను కొనుగోలు చేసే వ్యవస్థలు లేకపోవడంతో రైతు వద్దే ధాన్యం నిల్వ ఉండిపోతోంది.నిల్వకు తగిన సౌకర్యాలు లేకపోవడంతో ఎఫ్సీఐ, మిల్లర్లు పరిమిత పరిమాణంలోనే ధాన్యం కొనుగోలు చేయగలుగుతున్నారు. పెద్ద మొత్తంలో సరకు రైతుల వద్దే ఉండిపోతోంది.సమస్య తలెత్తినప్పడు రంగంలో దిగి పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అంటూ పార్టీలు దీన్ని ఎలక్షన్ ఇష్యూగా మార్చాయి.మార్కెట్లో రేట్లు తగ్గినందున కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చెల్లించి ఎందుకు కొనుగోలు చేయడం లేదంటూ ప్రశ్నిస్తున్నాయి. మొత్తం పంటను ఎందుకు ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. రైతులది కూడా ఇదే అభిప్రాయం కావడంతో ఈ ప్రచారం వారిని ఆకట్టుకుంటోంది. అయితే ఈ సమస్య కొన్ని ప్రాంతాలకు పరి మితమని, అక్కడ దీని ప్రభావం కొంతవరకు ఉంటుందని అధికార పార్టీ నాయకులు అంటున్నారు.