China – Pak : చైనా, పాకిస్థాన్లు కలిసి కశ్మీర్ విషయంలో విషం కక్కాయి. దక్షిణాసియా ప్రాంతంలోని కశ్మీర్ సహా అన్ని వివాదాస్పద అంశాల విషయంలో ఏకపక్ష చర్యలను అంగీకరించేది లేదని పేర్కొంటూ అవి సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. దక్షిణాసియాలో శాంతి, సుస్థిరతల స్థాపనకు కలిసికట్టుగా ప్రయత్నాలు చేస్తామని చైనా, పాక్ వెల్లడించాయి. భారత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో వరుసగా మూడోసారి కొత్త ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చైనా పర్యటనకు వెళ్లారు. నాలుగు రోజుల చైనా పర్యటనలో భాగంగా ఆయన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, చైనా ప్రీమియర్ లీ కియాంగ్లతో భేటీ అయ్యారు. ఈ పర్యటన ముగింపు సందర్భంగా పాక్, చైనాలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. జమ్ముకశ్మీర్లోని తాజా పరిస్థితులను గురించి చైనా నేతలకు పాకిస్థాన్(China – Pak) వివరించింది. ఐక్యరాజ్య సమితి చార్టర్ ప్రకారం కశ్మీర్ అంశాన్ని శాంతియుతంగా ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనుకున్న తమ సూచనను ఈసందర్భంగా చైనా పునరుద్ఘాటించింది.
We’re now on WhatsApp. Click to Join
గత రెండు దశాబ్దాలుగా ఆయుధాల కోసం పాకిస్తాన్ ప్రధానంగా చైనాపైనే ఆధార పడుతోంది. ఈ జాబితాలో యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు ఉన్నాయి. పాకిస్తాన్కు చైనా భారీగా అప్పులు కూడా ఇచ్చింది. పాకిస్తాన్లోని చాలా పరిశ్రమల్లోనూ చైనా ప్రభుత్వ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. పాక్లోని పలు ప్రధాన ఓడరేవులను కూడా చైనా కంపెనీలు లీజుకు తీసుకున్నాయి.
ఓ వైపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటోంది. పాక్ – ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న కొన్ని ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్లో తరుచూ ఉగ్రదాడులు చేసి, ఎంతోమందిని బలిగొంటున్నాయి. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్కు కూడా చైనా మద్దతుగా నిలుస్తోంది. ఆ దేశానికి అప్పులు ఇవ్వడంతో పాటు సైనిక సాయాన్ని చేసేందుకు డ్రాగన్ రెడీ అవుతోంది. అయితే ఈవిషయంలో చైనాకు ఎదురు చెప్పేందుకు పాకిస్తాన్ సాహసించలేక పోతోంది.