UN Apology : భారతదేశానికి ఐక్యరాజ్యసమితి క్షమాపణలు చెప్పింది. భారత సర్కారుకు, భారత ప్రజానీకానికి సారీ చెప్పింది. ఎందుకు అంటే.. గాజాలోని రఫా నగరంలో ఐక్యరాజ్యసమితి వాహనంపై ఇజ్రాయెల్ ఆర్మీ విచక్షణారహితంగా జరిపిన దాడిలో భారత మాజీ ఆర్మీ అధికారి 46 ఏళ్ల వైభవ్ అనిల్ కాలే అమరులయ్యారు. దీనిపై స్పందించిన ఐక్యరాజ్యసమితి.. భారత్కు సారీ(UN Apology) చెప్పుకుంది. కాలే కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. ఈమేరకు ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈవిషయంలో భారత్ అందించిన సహకారాన్ని అభినందిస్తున్నట్టు తెలిపారు. ఇజ్రాయెల్ చేసిన ఈ ఘోరమైన దాడిపై దర్యాప్తు చేసేందుకు ఐక్యరాజ్యసమితి నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. దీనిపై సాధ్యమైనంత వేగంగా దర్యాప్తు చేపడతామని ఫర్హాన్ హక్ తెలిపారు. దాడికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు ఇజ్రాయెల్తో చర్చలు జరుపుతున్నామని చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join
- మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన వైభవ్ అనిల్ కాలెకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
- 1998లో వైభవ్ అనిల్ భారత సైన్యంలో చేరారు. రెండు దశాబ్దాల పాటు సైనికుడిగా సేవలందించారు.
- భారత సైన్యంలో ఉన్నప్పుడు కూడా ఐరాస శాంతి పరిరక్షక దళంలోనూ విధులు నిర్వర్తించారు.
- 2009 నుంచి 2010 వరకూ ఐరాస చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా వ్యవహరించారు.
- 2022లో పదవీ విరమణ చేశారు.
- రెండు నెలల క్రితమే గాజాలోని ఐరాస రక్షణ, భద్రతా విభాగంలో సమన్వయకర్తగా వైభవ్ చేరారు.
- పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో ఉన్న రఫా నగరంలోని ఓ ఆస్పత్రిలో పరిస్థితిని సమీక్షించడానికి ఐక్యరాజ్యసమితి వాహనంలో వైభవ్ అనిల్ బయలుదేరారు. ఐరాస జెండాతో ఉన్న ఆ వాహనంపై ఇజ్రాయెల్ ఆర్మీ కాల్పులు జరిపింది. దీంతో అందులో ఉన్న వైభవ్ అనిల్ కాలె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
- వైభవ్ అనిల్ కాలే సోదరుడు విశాల్ కాలె ఇండియన్ ఎయిర్ఫోర్స్లో గ్రూప్ కెప్టెన్గా ఉన్నారు.
- అనిల్ బాబాయి కుమారుడు అమే కాలే ఆర్మీలో, బావ ప్రశాంత్ కర్డే వైమానిక దళం వింగ్ కమాండర్గా పనిచేసి రిటైర్ అయ్యారు.