Bird Flu Positive : బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాపిస్తోంది. మనుషులపైకి కూడా అది పంజా విసురుతోంది. ఈ ఏడాది ఆస్ట్రేలియా నుంచి ఇండియాలోని కోల్కతాకు వచ్చి వెళ్లిన రెండున్నరేళ్ల బాలికకు బర్డ్ ఫ్లూ పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం మన దేశంలోని కేరళ ప్రాంతంలో వ్యాపిస్తున్న H5N1 రకం బర్డ్ ఫ్లూ వైరస్ ఆ బాలికకు సోకిందని వైద్య పరీక్షల్లో తేలింది. H5N1 రకం బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులకు సోకిన తొలి కేసు ఇదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. సదరు బాలిక భారత్కు వెళ్లొచ్చిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిందని తెలిపింది. గతంలో కేవలం కోళ్లు, పక్షులకే H5N1 రకం బర్డ్ ఫ్లూ వైరస్ సోకిందని పేర్కొంది.
We’re now on WhatsApp. Click to Join
H5N1 రకం బర్డ్ ఫ్లూ వైరస్ బారినపడిన బాలిక కుటుంబం ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఇండియాలోని కోల్కతాకు వచ్చింది. వాళ్లు ఫిబ్రవరి 29 వరకు కోల్కతాలోనే ఉన్నారు. ఆ నగరంలో ఉండగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని ఎవరినీ ఆ కుటుంబం కలవలేదు. బాలిక కుటుంబం మార్చి 1న ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లింది. ఆ మరుసటి రోజే బాలిక అస్వస్థతకు గురైంది. దీంతో తల్లిదండ్రులు ఆమెను ఆగ్నేయ విక్టోరియా రాష్ట్రంలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు.
ఆస్పత్రిలో చికిత్సపొందుతుండగా సదరు బాలికలో బర్డ్ ఫ్లూ లక్షణాలు పెరిగాయి. దీంతో మార్చి 4న ఆమెను మెల్బోర్న్లోని ప్రముఖ ఆస్పత్రికి చెందిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్పించారు. అక్కడ బాలికకు ఒక వారం పాటు చికిత్స అందించారు. ఐసీయూ మరో రెండున్నర వారాల పాటు ట్రీట్మెంట్ జరిగింది. అనంతరం కోలుకోవడంతో బాలికను డిశ్చార్జ్ చేశారు. ఈ ఆస్పత్రిలో ఉన్న టైంలో టెస్ట్ చేయగా బాలికకు H5N1 రకం బర్డ్ ఫ్లూ వైరస్ సోకిందని వెల్లడైంది. మరింత లోతుగా వివరాలను సేకరించేందుకు ఈ ఏడాది ఏప్రిల్లోనే శాంపిల్స్ను ల్యాబ్కు పంపారు. వాటిని తనిఖీ చేసిన ల్యాబ్ బాలికకు సోకింది H5N1 రకం బర్డ్ ఫ్లూ వైరసే(Bird Flu Positive) అని మరోసారి నిర్ధారించింది. ఈవివరాలను తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ధ్రువీకరించింది. ప్రస్తుతం సదరు బాలిక క్షేమంగా ఉందని.. ఆమెకు సంబంధించిన ఆస్ట్రేలియా, భారత్లోని బంధువులు ఎవరిలోనూ బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని సమాచారం. ఇక ఈవివరాలను ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత ప్రభుత్వానికి పంపించింది. దీంతో ఆ సమాచారంపై పూర్తి వివరాలను సేకరించడంపై భారత ఆరోగ్య శాఖ ఫోకస్ పెట్టింది.