ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. మహిళా క్యాబ్ డ్రైవర్పై ఇద్దరు వ్యక్తులు బీర్ బాటిల్తో దాడికి పాల్పడ్డారు. సోమవారం రాత్రి ఢిల్లీలోని కశ్మీర్ గేట్లోని అంతర్ రాష్ట్ర బస్ టెర్మినస్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులు కారుపై రాళ్లు రువ్వి, దోపిడీకి ప్రయత్నించడంతో ఉబర్ క్యాబ్ మహిళా డ్రైవర్ తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని ఢిల్లీలోని సమయపూర్ బద్లీ నివాసి ప్రియాంకగా గుర్తించారు. ప్రియాంక జనవరి 9న, తాను కస్టమర్ కాల్పై ISBT వైపు వెళ్తున్నానని, దట్టమైన పొగమంచు కారణంగా కారును నెమ్మదిగా నడుపుతున్నానని చెప్పింది. ఆమె కస్టమర్కు దాదాపు 100 మీటర్ల దూరంలో ఉండగా ఇద్దరు వ్యక్తులు కారుకు ఎదురుగా వచ్చి రాయితో వాహన అద్దాన్ని పగలగొట్టారని.. ఆ రాయి తన తలకు తగిలి, పగిలిన గాజు ముక్కలు తన శరీరంపై పడ్డాయని ప్రియాంక తెలిపింది. ఏం జరిగిందో చూసేందుకు తాను కారు దిగగానే ఇద్దరు వ్యక్తులు తనను దూషించి తన వద్ద ఉన్న డబ్బును లాక్కెళ్లారని బాధితురాలు తెలిపింది. వారిలో ఒకరు తన చేయి పట్టుకోగా, మరొకరు తన మొబైల్ లాక్కున్నారని తెలిపింది. తాను ధైర్యం చేసి వారి దగ్గర నుంచి మొబైల్ని వెనక్కి లాక్కున్నానట్లు తెలిపింది.
ఇద్దరు వ్యక్తులు తన కారు కీలు లాక్కొని వాహనంలో పారిపోయేందుకు కూడా ప్రయత్నించారని బాధితురాలు తెలిపింది. ఆ సమయంలో ఒకరు బీర్ బాటిల్తో తనపై దాడి చేశారని… తన మెడ, ఛాతీపై గాయాలయ్యాయని మహిళా క్యాబ్ డ్రైవర్ తెలిపింది. తాను ఉబర్లోని ఎమర్జెన్సీ నంబర్ను సంప్రదించడానికి ప్రయత్నించానని, ఉబర్లో అందుబాటులో ఉన్న పానిక్ బటన్ను కూడా చాలా సేపు నొక్కినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని ప్రియాంక పేర్కొంది. చాలా వాహనాలను రోడ్డుపై నిలిపివేసినా ఎవరూ రక్షించలేదని ప్రియాంక తెలిపింది. ఘటన జరిగిన అరగంట తర్వాత పోలీసులు వచ్చారని.. రక్తస్రావం జరగకుండా ఉండటానికి తాను గడ్డ కట్టుకున్నానని తెలిపింది. పోలీసులు వచ్చిన తర్వాత వారు తనని పిఆర్సి వ్యాన్లో కూర్చోబెట్టి ఆసుపత్రికి తరలించారని బాధితురాలు తెలిపింది. కశ్మీర్ గేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 10వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు తమకు కాల్ వచ్చిందని, దోపిడీకి ప్రయత్నించినట్లు సమాచారం అందిందని తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం ప్రియాంక మెడ నుంచి రక్తం కారుతోంది. ఇద్దరు వ్యక్తులు తన క్యాబ్ కిటికీని రాయితో పగలగొట్టి తన మొబైల్ లాక్కోవడానికి ప్రయత్నించారని ప్రియాంక పోలీసులకు సమాచారం అందించింది. ఫిర్యాదు చేసేందుకు ప్రియాంక నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, కశ్మీర్ గేట్ పోలీసులు ఈ కేసును సుమోటోగా స్వీకరించారు IPC 393 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.