అసోం (Assam)లో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో రెండు వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు గురై ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అసోంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మరణించారు. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ASDMA) నివేదికల ప్రకారం.. దర్రాంగ్ జిల్లాలో ఒకరు మరణించగా, మరొకరు కమ్రూప్ (మెట్రో)లో మరణించారు.
Also Read: Accident: బెంగళూరులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
మొదటి సంఘటనలో దర్రాంగ్ జిల్లాలోని ఖర్పోరి గ్రామంలో పిడుగుపాటుకు గురై మజురుద్దీన్ అనే 60 ఏళ్ల వ్యక్తి మరణించాడు. గౌహతిలోని సత్గావ్ ప్రాంతంలో పిడుగుపాటుకు గురై 13 ఏళ్ల మైనర్ బాలిక మమతా బేగం మరణించిందని ASDMA నివేదిక పేర్కొంది. ప్రాంతీయ మెట్రోలాజికల్ సెంటర్ గౌహతి జారీ చేసిన హెచ్చరిక ప్రకారం.. గౌహతిలో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని గౌహతిలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది.