PM Kisan : పీఎం కిసాన్ 15వ విడత ఆర్థికసాయం ఇవాళ రైతన్నల ఖాతాల్లో జమకానుంది. జార్ఖండ్లోని ఖుంటిలో ఇవాళ ఉదయం జరిగిన ప్రత్యేక కార్యక్రమం వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. దీంతో అర్హులైన దాదాపు 8 కోట్లమందికిపైగా రైతుల ఖాతాల్లో రూ.2వేలు చొప్పున జమకానున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో నవంబరు 17న పోలింగ్ ఉంది. దీనికి సరిగ్గా రెండు రోజుల ముందు పీఎం కిసాన్ నిధులను రిలీజ్ చేయడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగానే ప్రధాని మోడీ ఇలా చేస్తున్నారని ఆరోపించింది. ఏదిఏమైనప్పటికీ ఈ-కేవైసీ పూర్తి చేసుకున్న రైతులందరి ఖాతాల్లో ఈరోజు రూ.2వేలు చొప్పున జమవుతాయి. ఈ-కేవైసీ పూర్తి చేయని వారికి డబ్బులు అందవు. అందుకే దీని ద్వారా లబ్ధిపొందుతున్న రైతులు ఒకసారి వారి అకౌంట్ ఈ కేవైసీ జరిగిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరిట పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఏడాదిలో మూడుసార్లు రూ.2వేలు చొప్పున మొత్తంగా రూ.6వేలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. ఇలా కేంద్ర సర్కారు ఇప్పటి వరకు 15సార్లు రైతుల ఖాతాల్లో(PM Kisan) జమచేసింది.
We’re now on WhatsApp. Click to Join.