అస్సాంలోని కమ్రూప్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తమలపాకు తోటలో ఆహారం కోసం వెళ్లిన మూడు అడవి ఏనుగులు విద్యుదాఘాతానికి గురై మరణించాయి. రాణి అటవీ రేంజ్ పరిధిలోని పనిచంద ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అడవి ఏనుగుల గుంపు ఆహారం కోసం సమీపంలోని అడవి నుండి ఆ ప్రాంతానికి వచ్చాయని, మూడు ఏనుగులు విద్యుత్ తీగలు తగిలి మరణించినట్లు కమ్రూప్ ఈస్ట్ డివిజన్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ రోహిణి సైకియా తెలిపారు. ఆడ ఏనుగుతో పాటు రెండు ఏనుగు పిల్లలు కూడా తోటలోకి వచ్చి చెట్టును లాగడానికి ప్రయత్నించాయని.. ఆ సమయంలో ఆ చెట్టుకు కరెంట్ వైర్లు ఉండటంతో విద్యుదాఘాతానికి గురైయ్యాయని తెలిపారు. గతంలో కూడా ఇలాంటి విద్యుదాఘాత ఘటనలు చోటుచేసుకున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని విద్యుత్ శాఖకు పలుమార్లు తెలిపినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. అస్సాంలో గత పదేళ్లలో దాదాపు 250 ఏనుగులు చనిపోయాయి. 2017 లెక్కల ప్రకారం భారతదేశంలో కర్నాటక తర్వాత ఈశాన్య రాష్ట్రంలో అడవి ఏనుగులు 5,719 ఉన్నాయని ..ఇక్కడే అత్యధికంగా ఉన్నట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలిపింది. అస్సాంలో ఏనుగుల మరణాలకు విద్యుదాఘాతం, విషప్రయోగం, రైలు ప్రమాదాలు కారణమయ్యాయి. ఏనుగుల బారి నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు తరచూ విద్యుత్ కంచెలను ఉపయోగిస్తున్నారు.