INDIA : ఇటీవల విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ ఇంటర్పోల్, ఎఫ్బీఐ నుండి సాయం కోరింది. అయితే అక్టోబర్ 13 నుండి 28 వరకు 410కు పైగా దేశీయ మరియు అంతర్జాతీయ విమాన సేవలకు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ బెదిరింపుల వెనక అమెరికాలోని ఖలిస్థానీ గ్రూపుల హస్తం ఉండోచ్చని భారత్ అనుమానిస్తోంది. గత వారం, సిఖ్స్ ఫర్ జస్టిస్ నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ భారత ప్రభుత్వాన్ని బహిరంగంగా బెదిరించిన విషయం తెలిసిందే. నవంబర్ 1-19 మధ్య ఎయిర్ విమానాలను బాయ్కాట్ చేయాలని, ఆర్థికంగా భారత్ను నాశనం చేయమని ఆయన పేర్కొన్నారు.
ఈక్రమంలో భారత్కు సహకరించేందుకు అమెరికా ఎఫ్బీఐ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయం ధ్రువీకరించింది. ఇక జర్మనీ, యూకే నుంచి సమాచార సేకరణకు సాయం చేయాలని ఇంటర్పోల్ను భారత్ కోరింది. వీపీఎన్లను వాడి పంపిన బెదిరింపు మెసేజ్ల మూలాలు ఆయా దేశాల్లో ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడంలో సహకరించాలని రిక్వెస్ట్ చేసింది.
కాగా, వీపీఎన్లను వాడి పంపిన సందేశాల మూలాలు ఈ దేశాల్లో ఉన్నాయా అనే దానిపై దర్యాప్తు జరుగుతోందని ఒక ప్రభుత్వ అధికారి తెలిపారు. ఈ బెదిరింపులు నిన్న కూడా అనేక విమానాలను ప్రభావితం చేశాయి. హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆరు విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. కేరళలోని కోజికోడ్లో అబుదాబీకి వెళుతున్న ఎయిర్ అరేబియా విమానానికి బెదిరింపు కాల్ చేసిన మహమ్మద్ ఇజాస్ను పాలక్కాడ్ జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు.