Pakistan Vs Shinde : భారత్లో ఉంటూ పాకిస్తాన్ భాష మాట్లాడే వారిపై దేశద్రోహం కేసును నమోదు చేసి, జైలుకు పంపాలని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు. ప్రధాని మోడీ హయాంలో దేశంలో వ్యాపించిన దేశ భక్తిని చూసి కొందరు సహించలేకపోతున్నారని పేర్కొన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్ నేత వాడెట్టివార్, పంజాబ్ మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు స్పందనగా ఏక్నాథ్ షిండే ఈ కామెంట్స్ చేశారు. ‘‘కొంతమంది పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఇది వారి దురదృష్టం మాత్రమే. భారత్కు వ్యతిరేకంగా మాట్లాడే వారిని మేం వదిలిపెట్టబోం’’ అని ఆయన(Pakistan Vs Shinde) వార్నింగ్ ఇచ్చారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)ను భారత్ ఆక్రమించుకుంటుంటే పాకిస్తాన్ చూస్తూ కూర్చోదు. పాక్ గాజులు తొడుక్కుని ఏం లేదు’’ అని ఫరూక్ అబ్దుల్లా ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను షిండే తప్పుపట్టారు. ‘‘పాక్ తరఫున మాట్లాడటానికి వీళ్లెవరు? పాకిస్థానీలా ? హిందుస్థానీలా? దేశద్రోహులా?’’ అని సీఎం షిండే ప్రశ్నించారు.
శరద్ పవార్ సుదీర్ఘకాలం రాష్ట్రంలో, కేంద్రంలో పని చేసినా మహారాష్ట్రకు ఏమీ చేయలేకపోయారని సీఎం షిండే మండిపడ్డారు. మహారాష్ట్ర రైతులకు కూడా ఈ విషయం తెలుసన్నారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.6వేలు, మహారాష్ట్ర ప్రభుత్వం మరో రూ.6 వేలు కలిపి ఏటా రూ.12 వేలను అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పంటల బీమాను ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. గత పదేళ్ల మోడీ పాలన రైతలకు స్వర్ణయుగం లాంటిదన్నారు. ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం ఏక్నాథ్ షిండే ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్ధవ్ థాక్రే హయాంలో శివసేన పార్టీ గాడి తప్పిందని.. బాల్ థాక్రే ఆశయాలకు ఉద్ధవ్ తూట్లు పొడిచారని మండిపడ్డారు. ఆ చేష్టలను చూసి ఊరుకోలేకే తాను తిరగబడినట్లు పేర్కొన్నారు.