PM Modi:దేశంలోనే అత్యంత పటిష్ట భద్రత మధ్య ప్రధాని మోదీ తన పర్యటనను సాగిస్తుంటారు. ఆయనకు ఐదంచెల భద్రత అనేది ఉంటుంది. తాజాగా కర్ణాటకలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అటువంటి భద్రతలో కూడా లోపం నెలకొంది. ప్రధాని ఎస్యూవీ కారులో బోర్డుపై నిలబడి ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తుండగా ఓ యువకుడు ఆకస్మికంగా సెక్యూరిటీ జోన్లోకి వచ్చేశాడు. కొద్ది క్షణాల్లోనే ఆ యువకుడు ప్రధాని నరేంద్ర మోడీ చెంతకు చేరిన ఘటన కర్ణాటకలోని హుబ్బలిలో జరిగింది.
ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం 29వ జాతీయ యువజన ఉత్సవాలను ప్రారంభించడానికి విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని రైల్వే స్పోర్ట్స్ గ్రౌండ్లో ప్రారంభించడానికి మోడీ హుబ్బలికి విచ్చేశారు. ఆ సమయంలో ఎయిర్పోర్టు నుంచి స్పోర్ట్స్ గ్రౌండ్కు వెళ్లుతుండగా ఆయన ర్యాలీలో అభిమానులు, ప్రజలకు అభివాదం చేయసాగారు. ఇంతలో అప్పుడే ఓ యువకుడు వేగంగా సెక్యూరిటీ కవర్లోకి వచ్చి ప్రధాని మోడీకి మోచేతి దూరం వరకు వెళ్లగలిగాడు.
ఆ యువకుడు ఓ పూల మాలను ప్రధాని మోడీకి వేసి గౌరవించాలనే ఉద్దేశంతో అక్కడికి వచ్చినట్లు సమాచారం. అయితే, అతను మోడీ వద్దకు చేరుతుండగా సమీపానికి వచ్చిన తర్వాత స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ వెంటనే ఆ యువకుడిని తమ అదుపులోకి తెచ్చుకుంది. వెంటనే అక్కడి నుంచి ఆ యువకుడిని బలగాలు అడ్డుకుంటూ ఉండగా ప్రధాని మోడీ మాత్రం ఆ పూలమాలను స్వీకరించడానికి చేయి చాచినట్టు తెలుస్తోంది.
దీంతో ఓ అధికారి పూల మాలను ప్రధాని మోడీకి అప్పగించడంతో ప్రధాని దానిని కారులో పెట్టినట్టు వీడియోలో తెలుస్తోంది. అయితే, ఆ యువకుడు అంతటి కట్టుదిట్టంగా భద్రత ఉన్నటువంటి చోట ఎలా ప్రధాని వద్దకు వెళ్లగలిగాడనే విషయం ఇప్పుడు ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ర్యాలీ అంతా కోలాహలంగా ఉన్నా వేలాది మంది నినాదాలు చేస్తూ ఉన్నా కూడా అతను అక్కడికి ఎలా వచ్చాడనే దానిపై అధికారులు ఆరాతీస్తున్నారు.
