One Nation One Election : ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ అంశంపై కేంద్ర సర్కారు వేగంగా కసరత్తు చేస్తోంది. దీనితో ముడిపడిన న్యాయపరమైన అంశాలపై చర్చించేందుకు ఇవాళ లా కమిషన్ సభ్యులు ఢిల్లీలో భేటీ కానున్నారు. ఒకేసారి లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలను నిర్వహించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై మేధోమథనం చేయనున్నారు. లా కమిషన్ ఛైర్మన్ జస్టిస్ రితురాజ్ అవస్థి సారథ్యంలో ఈ మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్ తర్వాత ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ విధానంపై లా కమిషన్ తన వైఖరిని స్పష్టం చేస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. ‘‘జమిలి ఎన్నికలతో ప్రభుత్వ ఖజానాను భారీగా ఆదా చేయొచ్చు. తరుచూ ఎన్నికల కారణంగా ఓటర్లలో నిరాసక్తత ఏర్పడుతోంది. ఐదేళ్లకు ఓసారి ఎన్నికలు నిర్వహిస్తే పోలింగ్ శాతం సైతం పెరుగుతుంది’’ అనే ఒపీనియన్ తో లా కమిషన్ ఉందని సంబంధిత వర్గాలు అంటున్నాయి.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశంపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలో 8 మంది నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీని కేంద్ర సర్కారు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇవాళ జరిగే లా కమిషన్ భేటీలో పోక్సో చట్టం కింద పిల్లల కనీస వయస్సును కూడా లా కమిషన్ నిర్థారించనుందనే అంచనాలు వెలువడుతున్నాయి. లైంగిక నేరాల విషయంలో మైనర్లుగా నిర్థారించే వయస్సును 18 నుంచి 16కు తగ్గించాలన్న ప్రతిపాదనపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఆన్లైన్ ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు అంశాన్ని లా కమిషన్ నిపుణులు పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఈ అన్ని అంశాలపై చర్చించి ఒక సమగ్ర నివేదికను కేంద్ర సర్కారుకు లా కమిషన్ (One Nation One Election) సమర్పించనుంది.