కేంద్రం రైల్వే స్థలాలపై కన్నేసింది. వాటిని లీజుకు ఇవ్వడానికి సిద్ధం అయింది. ఆ మేరకు కేంద్ర క్యాబినెట్ తీర్మానం చేసింది. ఇప్పటి వరకు రైళ్లను ప్రైవేటు చేస్తోన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు భూములను లీజుకు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది. పబ్లిక్ సెక్టార్ కంపెనీలను అమ్మేస్తోన్న మోడీ సర్కార్ రైల్వే స్థలాలను లీజుకు ఇవ్వడాన్ని సానుకూల నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం భేటీ అయిన కేంద్ర కేబినెట్ భారతీయ రైల్వేలకు చెందిన స్థలాలను లీజుకు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటిదాకా రైల్వే స్థలాలను లీజుకు ఇచ్చే అవకాశమే లేకపోగా , తాజాగా ఈ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులు లీజుకు తీసుకునే వెసులుబాటు లభించింది.
పీఎం గతి శక్తి యోజనకు నిధులు సమకూర్చుకునేందుకు రైల్వే స్థలాలను లీజుకు ఇవ్వాలని కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది. ఇక నుంచి పీఎం శ్రీ పేరిట సర్కారీ స్కూళ్ల నూతన పథకానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. రానున్న ఐదేళ్లలో 14 వేల స్కూళ్లను రూ.23 వేల కోట్లతో అభివృద్ధి చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 18 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుందని కేబినెట్ తెలిపింది.