Ayodhya – Tent City : అయోధ్య రామమందిరం జనవరి 22న ప్రారంభం కాబోతోంది. దీనికోసం ఉత్తర ప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయోధ్యను దర్శించుకునే ప్రముఖ భక్తుల కోసం నిషాద్రాజ్ అతిథి గృహ్ పేరిట టెంట్ సిటీని ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ అత్యాధునిక వసతులతో ప్రముఖుల బస కోసం ఏర్పాట్లు చేశారు. రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులకు టెంట్ సిటీలో వసతి కల్పిస్తారు. టెంట్ సిటీలో భద్రతకు, పరిశుభ్రతకు పెద్దపీట వేశారు. ఇందులో మెుత్తం 4 కాటేజీలు ఉన్నాయి. ప్రముఖుల స్థాయిని అనుసరించి, వారికి గదులను కేటాయించనున్నారు. టెంట్ సిటీకి ‘నిషాద్రాజ్ గుహ’ పేరు పెట్టడం వెనుక ఆసక్తికరమైన కారణమే ఉంది. అది తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join.
పురాణ కథనం ప్రకారం.. శ్రీరామచంద్రుడు, సీతా, లక్ష్మణ సమేతంగా వనవాసానికి బయలుదేరినప్పుడు వారిని అయోధ్య రాజ్యంలోని మంత్రి సుమంత్ర తమ రథంపై గంగానది తీరంలో ఆదివాసీ రాజు నిషాద్రాజ్ గుహ వద్ద వదిలి వెళ్లిపోయారు. నిషాద్రాజ్ గుహ కేవటి రాజ్యాధినేత. తన రాజధాని శృంగవీరపుర. శ్రీరాముడు ఇక్కడే తన రాజభోగాన్ని వదిలేసి, అరణ్యవాసిగా మారారు. రాజధాని శివార్లలో ఓ చెట్టు కింద గడ్డి, చెట్ల ఆకులతో పడక తయారు చేసుకుని శ్రీరాముడు, సీతామాత ఆ రాత్రి నిద్రించారు. వారికి లక్ష్మణుడితో పాటు కేవటి రాజ్యాధినేత నిషాద్రాజ్ గుహ కూడా కాపలాగా రాత్రంతా నిల్చున్నారు. మర్నాడు ఉదయాన్నే సీతారామలక్ష్మణులకు పండ్లు, కందమూలాలు ఆహారంగా అందజేశారు. ఆ తర్వాత తన పడవలో శ్రీరామచంద్రుడిని గంగా నది దాటించి అవతిలి ఒడ్డుకు చేర్చారు. అలా శ్రీరామచంద్రుడి వనవాసానికి తొలి అడుగు పడిన కేవటి రాజ్యాధినేత నిషాద్రాజ్ గుహ పేరు మీద టెంట్ సిటీ ఎందుకు నిర్మిస్తున్నారో ఈపాటికి మీకు అర్థమై ఉంటుంది. శ్రీరామచంద్రుడి వనవాసంలో తొలి రోజు ఆతిథ్యమిచ్చిన నిషాద్రాజ్ గుహ ఆ రాముడికి ఆ జన్మాంతం మంచి స్నేహితుడిగా ఉన్నాడు. 14 ఏళ్ల అరణ్యవాసం ముగించుకుని తిరిగి అయోధ్యకు చేరుకున్న తర్వాత శ్రీరాముడు మర్చిపోకుండా నిషాద్రాజ్ గుహను కలిశారు. అంతేకాదు, తన పట్టాభిషేకానికి కూడా ఆహ్వానించారు. అందుకే శ్రీరాముడికి ఆశ్రయమిచ్చిన నిషాద్రాజ్ పేరిట టెంట్ సిటీని(Ayodhya – Tent City) నిర్మించారు.