మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన కామెంట్స్ తాలూకు ప్రకంపనలు ఇంకా ముగిసిపోలేదు. ఈ క్రమంలో రాజస్థాన్ లో దారుణ సంఘటన జరిగింది. నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వ్యక్తిని తలనరికి చంపారు. ఈ ఘటన ఉదయ్ పూర్ లోని మాల్దాస్ ప్రాంతంలో మధ్యాహ్నం జరింగింది. ఈ హత్యలో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ వ్యక్తులు సోషల్ మీడియాలో వీడియో పోస్టు షేర్ చేశారు. మోదీకి కూడా ఇదే గతి పడుతుందంటూ హెచ్చరించారు.
మృతుడు కన్హయ్యా లాల్ గా గుర్తించారు. మృతుడు టైలర్ గా పనిచేస్తుంటాడు. హంతకుల్లో ఒకరిని రియాజ్ గుర్తించారు. ఓ పదునైనా కత్తితో కన్హయ్య లాల్ తల నరకగా…మరోవ్యక్తి ఈ ఘాతుకాన్ని మొబైల్లో వీడియో తీశాడు. ఈ హత్య వీడియో సోషల్ మీడియాలో కనిపించడంతో ఉదయ్ పూర్ లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కన్హయ్య లాల్ హత్యకు నిరసనగా స్థానిక మార్కెట్లను మూసివేశారు. హంతకులను కఠినంగా శిక్షించాలని వ్యాపారులు పెద్దెత్తున డిమాండ్ చేశారు.
ఇక ఈ దారుణ ఘటనపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ స్పందించారు. ఉదయ్ పూర్ లో యువకుడి హత్యను తీవ్రంగా ఖండించినట్లు తెలిపారు. ప్రజలు సంయమనం పాటించాలని…ఇది విషాదకర ఘటన అని పేర్కొన్నారు. నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టమని స్పష్టం చేశారు. ఈ హత్య వీడియోను షేర్ చేయవద్దని విజ్ణప్తి చేశారు.