Tamil Nadu: తమిళనాడు కాంగ్రెస్ నేత, విలవంకోడ్ అసెంబ్లీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్.విజయధరణి ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. శనివారం న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్, బీజేపీ జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్ సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరడం తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ అదృష్టానికి పెద్ద దెబ్బ తగిలినట్టైంది. బీజేపీకి ఇది కలిసొచ్చే అంశమనే చెప్పాలి. అంతకుముందు న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకత్వంతో విజయధరణి చర్చలు జరుపుతున్నట్లు ఐఏఎన్ఎస్ కథనం ప్రచురించింది. అయితే తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు, కె.సెల్వపెరుంతగై శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, విజయధరణి న్యాయవాది కావడంతో సుప్రీంకోర్టులో కొన్ని కేసులకు హాజరయ్యేందుకు న్యూఢిల్లీ వచ్చినట్లు చెప్పారు. ఆమె బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. కానీ ఈ రోజు ఆమె కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి చేరడం చర్చనీయాంశమైంది.