కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్ళీ అంతకు రెండేంతలు విస్తరిస్తోంది. అయితే కరోనా తగ్గు ముఖం పట్టడంతో అందరూ కరోనా వెళ్ళిపోతుంది అని భావించారు. అయితే కరోనా ముప్పు ఇంకా తొలగకముందే ఇంతలోనే మంకీ పాక్స్ వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కాగా ఇప్పటికే 50కి పైగా దేశాలకు ఈ వైరస్ వ్యాప్తిచెందగా వేల కొద్దీ కేసులు వెలుగులోకి వచ్చాయి. కాగా మన దేశంలో ఈ వైరస్ కేసులు నమోదు కానప్పటికీ తాజాగా కేరళలో ఓ వ్యక్తిలో మంకీపాక్స్ తరహా లక్షణాలు కనిపించడం ప్రస్తుతం అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.
కాగా ఇటీవల విదేశాల నుంచి తిరిగొచ్చిన ఓ వ్యక్తి మంకీపాక్స్ తరహా లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. వైరస్ నిర్ధారణ పరీక్షల తరువాత అతడి నుంచి సేకరించిన నమూనాలను పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్లు తెలిపారు. ఆ ఫలితాలు వచ్చిన తర్వాత వ్యాధిని ధ్రువీకరించగలమన్నారు. సదరు వ్యక్తి విదేశాల్లో మంకీపాక్స్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగినట్లు మంత్రి తెలిపారు. గత కొద్దీ రోజులుగా మంకీపాక్స్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే.
ఇప్పటి వరకు 59 దేశాల్లో ఈ వైరస్ జాడ బయటపడగా 6వేలకు పైగా కేసులు మూడు మరణాలు నమోదయ్యాయి. అయితే, ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో 80శాతం కేవలం యూరప్ దేశాల్లోనే బయటపడ్డట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల వెల్లడించింది.