Supreme Court : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యల పెరుగుదలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, భారత సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. విద్యార్థులకు మానసిక ఆరోగ్యం మరియు మద్దతు అందించేందుకు ఉద్దేశించిన 15 సమగ్ర మార్గదర్శకాలను తాజాగా జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు అన్ని స్థాయిలలోని విద్యా సంస్థలు, స్కూళ్లు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, విశ్వవిద్యాలయాలు, శిక్షణ అకాడెమీలు, హాస్టళ్లపై వర్తిస్తాయి. సుప్రీంకోర్టులో జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల బెంచ్ ఈ తీర్పును ఇచ్చింది. విద్యా ఒత్తిడి, పరీక్షల భయం, మద్దతు లోపం కారణంగా విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఇది ఆత్మహత్యలకు దారి తీస్తోంది. అని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. ప్రతి విద్యా సంస్థలో తప్పనిసరిగా మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్ అందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
సుప్రీంకోర్టు జారీ చేసిన 15 మార్గదర్శకాలలో ముఖ్యమైనవి:
. మానసిక ఆరోగ్య శిక్షణ: బోధన, బోధనేతర సిబ్బంది అందరూ సంవత్సరానికి రెండుసార్లు తప్పనిసరి మానసిక ఆరోగ్య శిక్షణ పొందాలి. ఈ శిక్షణలో మానసిక సహాయం, ఒత్తిడి సంకేతాల గుర్తింపు, స్వీయ-హాని సందర్భాల్లో స్పందన, సరైన సహాయానికి రిఫరల్ ప్రక్రియలపై దృష్టి ఉంటుంది.
. వివక్ష రహిత విధానం: విద్యార్థులతో సున్నితంగా, సమగ్రంగా వ్యవహరించేలా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.
. ఫిర్యాదుల కమిటీ: లైంగిక వేధింపులు, ర్యాగింగ్, ఇతర ఫిర్యాదులను పరిష్కరించేందుకు అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలి. బాధిత విద్యార్థులకు తక్షణమే మానసిక-సామాజిక మద్దతు అందించాలి.
. సెన్సిటైజేషన్ కార్యక్రమాలు: తల్లిదండ్రులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులకు మానసిక ఆరోగ్య సాక్షరత, భావోద్వేగ నియంత్రణ, జీవన నైపుణ్యాలను విద్యా కార్యకలాపాల్లో భాగంగా చేర్చాలి.
. సూసైడ్ హెల్ప్లైన్: టెలి-మానస్ వంటి జాతీయ సూసైడ్ హెల్ప్లైన్ నంబర్లను హాస్టళ్లు, తరగతి గదులు, సాధారణ ప్రాంతాలు, వెబ్సైట్లలో పెద్ద అక్షరాలతో స్పష్టంగా ప్రదర్శించాలి.
. వెల్నెస్ రికార్డులు: విద్యార్థుల మానసిక ఆరోగ్య రికార్డులను అత్యంత గోప్యంగా నిర్వహించాలి.
ఈ మార్గదర్శకాలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2022 గణాంకాల ఆధారంగా రూపొందించబడ్డాయి. వాటి ప్రకారం, 2022లో దేశంలో నమోదైన మొత్తం 1,70,924 ఆత్మహత్యలలో 13,044 విద్యార్థులవి. అంటే ప్రతి 100 ఆత్మహత్యలలో 8 మంది విద్యార్థులే కావడం ఆందోళనకరం. 2001లో ఈ సంఖ్య 5,425గా ఉండగా, 2022 నాటికి ఇది కంటే దాదాపు రెండింతలైంది. పరీక్షలలో విఫలమవడం వల్ల 2022లోనే 2,248 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ గణాంకాలు విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను చూపిస్తున్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ తీర్పుకు నేపథ్యం విశాఖపట్నంలో చోటుచేసుకున్న ఒక విషాద ఘటన. 2023 జూలై 14న ‘నీట్’ పరీక్షకు సిద్ధమవుతున్న 17 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తండ్రి ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరారు.
అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2024 ఫిబ్రవరి 14న ఆ అభ్యర్థనను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఈ కేసులో సీబీఐ దర్యాప్తును ఆదేశించింది. సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 మరియు 141 ప్రకారం ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలు తగిన చట్టం చేయడం వరకు ఈ మార్గదర్శకాలు తాత్కాలిక చట్టబద్ధత కలిగినవిగా పరిగణించబడతాయి. అంతేకాక, విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్ ఫోర్స్ (జస్టిస్ రవీంద్ర ఎస్ భట్ నేతృత్వంలో) చర్యలను ఈ మార్గదర్శకాలు మరింత బలపరుస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నిర్ణయం దేశంలోని విద్యా వ్యవస్థలో మానవీయతను ప్రోత్సహించేందుకు, విద్యార్థుల మనోస్థైర్యాన్ని గణనీయంగా మెరుగుపర్చేందుకు కీలక మైలురాయిగా మారనుంది.
Read Also: Maoists : ఏపీ డీపీజీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు.. భారీగా ఆయుద సామగ్రిని స్వాధీనం