Defamation Case : ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పరువునష్టం కేసును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ హృషికేష్ రారు, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రధాని మోడీ విద్యార్హతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేజ్రీవాల్పై గుజరాత్ యూనివర్శిటీ పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.
ప్రధాని మోడీ విద్యా ప్రమాణాలు ముఖ్యంగా గుజరాత్ యూనివర్శిటీలో ఆయన చేసిన డిగ్రీ చెల్లుబాటును కేజ్రీవాల్ బహిరంగంగా, మీడియా వేదికగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు తమ యూనివర్శిటీ ప్రతిష్టను దెబ్బతీసేలా, అగౌరవ పరిచేలా ఉన్నాయని గుజరాత్ యూనివర్శిటీ వ్యాఖ్యానించింది. గుజరాత్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ పీయూష్ పటేల్ కేజ్రీవాల్, ఆప్ నేత సంజరు సింగ్లపై పరువునష్టం కేసు దాఖలు చేశారు.
విచారణకు హాజరుకావాలని గుజరాత్ ట్రయల్ కోర్టు ఇచ్చిన నోటీసులను కొట్టివేయాలంటూ కేజ్రీవాల్ గుజరాత్ హైకోర్టును కోరారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గుజరాత్ హైకోర్టు ఆ పిటిషన్ను తిరస్కరించడంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడకూడా ఆయనకు నిరాశే ఎదురయ్యింది.
సుప్రీంకోర్ట్ న్యాయమూర్తులు జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం సోమవారం కేజ్రీవాల్ పిటిషన్పై విచారణ జరిపింది. వాదోపవాదాల అనంతరం ఈ పిటిషన్ ను కొట్టివేసింది. గతంలో ఇలాగే సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను ఏప్రిల్ 2024లో కొట్టివేసినట్లు ధర్మాసనం గుర్తుచేసింది. అందువల్ల, కేజ్రీవాల్ కేసును కూడా విచారించేందుకు ధర్మాసనం నిరాకరించింది.
సుప్రీం కోర్టులో కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. మోడీ డిగ్రీని యూనివర్సిటీ ఎందుకు బయటపెట్టడం లేదు? ఆ డిగ్రీ నకిలీదా? అని ఆయన ప్రశ్నించారు.
కేజ్రీవాల్ వ్యాఖ్యలు అవమానకరంగా ఉంటే, గుజరాత్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కాదు నరేంద్ర మోడీయే పరువు నష్టం దావా వేయాల్సిందని సింఘ్వీ వాదించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలను యూనివర్సిటీకి అవమానకరంగా పరిగణించలేమని ఆయన అన్నారు. యూనివర్సిటీ తరపున భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, సంజయ్ సింగ్ కేసులో ఇచ్చిన తీర్పును ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. యూనివర్సిటీ లాయర్ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం పరువు నష్టం విచారణను కొనసాగించాలని నిర్ణయించింది.