Submarine Leak: ఇండియన్ నేవీ సమాచారాన్ని లీక్ చేసిన అధికారులు

రష్యా నుంచి కొనుగోలు చేసిన సబ్​మెరైన్​ల ఆధునీకరణకు సంబంధించిన కీలక సమాచారాన్ని లీక్ చేసినందుకు ఇద్దరు నేవీ కమాండర్స్ మరియు నలుగురు రిటైర్డ్ అధికారులపై సీబీఐ ఛార్జ్ షీట్ వేసింది.

  • Written By:
  • Updated On - November 3, 2021 / 11:51 AM IST

రష్యా నుంచి కొనుగోలు చేసిన సబ్​మెరైన్​ల ఆధునీకరణకు సంబంధించిన కీలక సమాచారాన్ని లీక్ చేసినందుకు ఇద్దరు నేవీ కమాండర్స్ మరియు నలుగురు రిటైర్డ్ అధికారులపై సీబీఐ ఛార్జ్ షీట్ వేసింది. ఈ కేసులో ఇప్పటికే ఒక నేవీ కమాండర్, ఇద్దరు రిటైర్డ్ అధికారులను సీబీఐ అరెస్టు చేసింది. వారిని విచారించి మరికొంత మంది పేర్లను ఛార్జ్ షీట్ లో చేర్చారు.

ప్రస్తుతం ముంబైలో పనిచేస్తున్న ఒక కమాండర్ స్థాయి అధికారి కిలో క్లాస్ సబ్-మెరైన్ ఆధునికీకరణకు సంబంధించిన కీలక సమాచారాన్ని రహస్యంగా రిటైర్డ్ ఉద్యోగులకు పంపించినట్లు సమాచారం. అరెస్ట్ అయిన వారితో సంబంధాలున్న నేవీ ఉద్యోగులను కూడా సీబీఐ ప్రశ్నిస్తోంది. త్రివిధ దళాలకు చెందిన అనేక మంది విశ్రాంత ఉద్యోగులపై దర్యాప్తు సంస్థలు నిఘా పెడుతున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు ఈ క్రమంలోనే తాజా అరెస్టులు జరిగాయని, వీరి నుంచి అందిన సమాచారం ఆధారంగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని చెప్పారు.

ఇండియన్ నేవీ కూడా ఈ ఘటనపై హై లెవల్ విచారణకు ఆదేశించింది. వైస్ అడ్మిరల్, రేర్ అడ్మిరల్ స్థాయి అధికారుల నేతృత్వంలో విచారణకు ఆదేశించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇందుకోసం ఐదుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపాయి. ఇలాంటి ఘటనలు భవిష్యత్​లో జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని వీరిని ఆదేశించారు.

సోవియట్ నేవీ కోసం తయారుచేసిన కిలో క్లాస్ సబ్‌మెరైన్‌లు ప్రపంచంలోని అత్యంత సాధారణ సాంప్రదాయ జలాంతర్గాములలో ఒకటి. ఇవి ప్రస్తుతం అనేక దేశాల నౌకాదళాలలో సేవలు అందిస్తున్నాయి. భారత్‌లో వీటిని సింధుఘోస్ తరగతిగా వర్గీకరించారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం ఈ రకం జలాంతర్గాములను పదింటిని కొనుగోలు చేసింది. వీటిని విస్తృతంగా ఆధునికీకరిస్తున్నారు. ప్రస్తుతం నేవీ వద్ద 15 వరకూ కన్వెన్షనల్, రెండు అణు జలాంతర్గాములు ఉన్నాయి.