Earthquake: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.0గా నమోదైంది. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ప్రకంపనలు బలంగా రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై తమ ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం వచ్చిన సమయంలో కేంద్ర సహాయ మంత్రి సుకాంత మజుందార్ ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. ఆయన కూడా ఈ ప్రకంపనలను గమనించి, అక్కడి ప్రజలను ప్రశాంతంగా ఉండాలని కోరారు.
బంగ్లాదేశ్లో భూకంప కేంద్రం
యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) సమాచారం ప్రకారం.. ఈ భూకంప కేంద్రం బంగ్లాదేశ్లోని ఖుల్నా డివిజన్, సత్ఖీరా ప్రాంతంలో, భూగర్భంలో సుమారు 35 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. కానీ ప్రజల్లో భయాందోళనలు కొనసాగుతున్నాయి. కోల్కతాలోని సాల్ట్ లేక్ ప్రాంతంలో భవనాలు ఊగడం గమనించిన ప్రజలు భయంతో రోడ్ల పైకి వచ్చి చాలా సేపటి వరకు అక్కడే ఉన్నారు.
Also Read: Record in CM Revanth : సీఎం రేవంత్ ఖాతాలో అరుదైన రికార్డు
ప్రత్యక్ష సాక్షుల అనుభవం
భూకంప తీవ్రత గురించి ప్రత్యక్ష సాక్షులు వివరిస్తూ తమ జీవితంలో ఇంతటి బలమైన ప్రకంపనలు ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. ప్రకంపనలు కొన్ని సెకన్ల పాటు కొనసాగాయి. ఫ్యాన్లు ఊగడం, అల్మారాల్లో ఉన్న వస్తువులు కింద పడిపోవడం వంటివి జరిగాయి. గోడలకు తగిలించిన చిత్రపటాలు కూడా కింద పడి పగిలిపోయాయి. భూకంపం రాగానే కార్యాలయాల్లో గందరగోళం నెలకొంది. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు మెట్ల మార్గం గుండా బయటకు పరుగు తీశారు. ఈ క్రమంలో కొందరు కిందపడి స్వల్ప గాయాలపాలయ్యారు. అయితే పెద్దగా ప్రాణనష్టం జరగలేదు.
సిక్కింలోనూ భూకంపం
కోల్కతాలో ఫిబ్రవరి 27 మధ్యాహ్నం 1:22 గంటలకు భూకంపం సంభవించింది. దీని కేంద్రం బంగ్లాదేశ్ సరిహద్దుకు 3 కిలోమీటర్ల లోపు ఉంది. దీనికి ముందే ఈ రోజు ఉదయం 4:10 గంటలకు సిక్కింలో కూడా భూకంపం సంభవించింది. ఆ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైంది. ఈ తీవ్రతకు తాషీడింగ్లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, గెరెతాంగ్ జూనియర్ హైస్కూల్ పైకప్పులు కూలిపోవడమే కాకుండా గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి.
