Nehru Death Anniversary : భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా సోమవారం (మే 27) ఢిల్లీలోని ఆయన స్మారక స్థూపం వద్ద చిత్రపటానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. ‘‘భారతదేశాన్ని శాస్త్రీయ, ఆర్థిక, పారిశ్రామిక రంగాలలో ముందుకు తీసుకెళ్లిన ఆధునిక భారతదేశ రూపశిల్పి పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఆయన సాటిలేని సహకారం వల్లే భారత్ ఈ స్థాయికి ఎదిగింది. ఆయన ప్రజాస్వామ్య సంరక్షకుడిగా వ్యవహరించారు. భారతీయులందరి స్ఫూర్తికి నెహ్రూ కూడా ఓ మూలం’’ అని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘దేశ రక్షణే మనందరి ప్రథమ కర్తవ్యం. దేశ పురోగతి, దేశ ఐక్యత కోసం అందరూ ప్రయత్నించాలి. మనం వివిధ మతాలను అనుసరించవచ్చు. వివిధ భాషలు మాట్లాడవచ్చు. కానీ ఈ తేడాల కారణంగా మన మధ్య అడ్డుగోడలను కట్టుకోకూడదు. మన దేశంలో కొంతమందే చాలా ధనవంతులుగా ఉండాలని.. చాలామంది పేదలుగా మిగిలిపోవాలని మేం కోరుకోం. నేటికీ కాంగ్రెస్ పార్టీ నెహ్రూ చూపించిన న్యాయ మార్గాన్ని అనుసరిస్తోంది’’ అని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తెలిపారు.
జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయనను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్మరించుకున్నారు. ‘‘స్వాతంత్య్ర ఉద్యమం, ప్రజాస్వామ్య ప్రభుత్వ నిర్మాణం, లౌకికవాదానికి బీజాలు, రాజ్యాంగ పునాదిని వేయడంలో నెహ్రూ పోషించిన పాత్రను ఎవరూ కాదనలేరు. భారతదేశాన్ని గొప్ప దేశంగా నిర్మించడానికి నెహ్రూ తన జీవితాన్ని ధారపోశారు’’ అని రాహుల్ చెప్పుకొచ్చారు. ‘‘ఆధునిక భారతదేశ రూపశిల్పి నెహ్రూ. ఆయనకు గౌరవప్రదమైన నివాళులు’’ అని పేర్కొన్నారు.