Singer Chithra – Ayodhya : ‘‘అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమ సమయంలో దేశ ప్రజలు రాముడి శ్లోకాలను జపించాలి’’ అని ప్రముఖ సింగర్ కేఎస్ చిత్ర రెండు రోజుల క్రితం ఒక వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘ఈ పవిత్ర కార్యక్రమం జరిగేటప్పుడు ప్రతీ ఒక్కరు మధ్యాహ్నం 12.20 గంటలకు శ్రీరామ జయ రామ జయజయ రామ మంత్రాన్ని జపించాలి. అదే రోజు సాయంత్రం ప్రజలు తమ ఇళ్లలో ఐదు వత్తుల దీపాలను వెలిగించాలి. ఆ సర్వేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు’’ అని ఆ వీడియో సందేశంలో కేఎస్ చిత్ర పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అయితే సింగర్ చిత్ర(Singer Chithra – Ayodhya) ఇలా పిలుపునివ్వడాన్ని నెటిజన్లలో ఓ వర్గానికి నచ్చలేదు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇలాంటి సందేశాలు ఇవ్వడం ద్వారా చిత్ర రాజకీయంగా వ్యవహరించారని పలువురు నెటిజన్స్ కామెంట్స్ పెట్టారు. మరో వర్గం నెటిజన్లు చిత్ర వ్యక్తీకరించిన భావాలకు తమ మద్దతు తెలిపారు. సింగర్ చిత్రకు కూడా భావాలను వ్యక్తీకరించే హక్కు, స్వేచ్ఛ ఉన్నాయని వ్యాఖ్యానించారు. అంతకుముందు కేరళలోని త్రిసూర్లో బీజేపీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో నటి శోభన వేదికను పంచుకోవడాన్ని ఒక వర్గం నెటిజన్స్ తీవ్రంగా విమర్శించారు.
Also Read: 10th Cheetah Died : చనిపోయిన పదో చీతా.. మరణానికి కారణమేంటి ?
అయోధ్య రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం నుంచి ఇందుకు సంబంధించిన సంప్రదాయ క్రతువులు ప్రారంభమై జనవరి 21 వరకు నిరంతరాయంగా జరుగుతాయి. జనవరి 16న ఆలయ ట్రస్ట్ నియమించిన ప్రతినిధి ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సరయూ నది ఒడ్డున ‘దశవిధ’ స్నానం, విష్ణుపూజ, గోపూజ జరుగుతాయి. జనవరి 17న రామ్లల్లా విగ్రహం ఊరేగింపుగా అయోధ్యకు చేరుకుంటుంది. మంగళ కలశంలో సరయూ జలాన్ని తీసుకొని భక్తులు ఆలయానికి చేరతారు. జనవరి 18న గణేష్ అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, వాస్తు పూజలతో సంప్రదాయ క్రతువులు ప్రారంభమవుతాయి. జనవరి 19న యజ్ఞం ప్రారంభం అవుతుంది. తర్వాత ‘నవగ్రహ’ ‘హవన్’ స్థాపన నిర్వహిస్తారు. జనవరి 20న రామజన్మభూమి ఆలయ గర్భగుడిని సరయూ నీళ్లతో శుభ్రం చేస్తారు. తర్వాత వాస్తు శాంతి ‘అన్నాదివస్’ ఆచారాలను పండితులు నిర్వహిస్తారు. జనవరి 21న రామ్లల్లా విగ్రహానికి 125 కలశాలతో అభిషేకం చేస్తారు. జనవరి 22న ప్రధాన ప్రాణ ప్రతిష్ఠ వేడుక మధ్యాహ్నం 12:30 గంటలకు మొదలవుతుంది. రామ్లల్లా విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాపన చేస్తారు. చివరి రోజు జరిగే మహోత్సవానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 7 వేల మందికి ఆలయ ట్రస్టు ఆహ్వానాలు పంపింది.