Rajnath Singh: పాక్ చర్యలపై ఆధారపడి సిందూర్ పార్ట్ 2 మళ్లీ మొదలవొచ్చు : రాజ్‌నాథ్

ఆపరేషన్ సింధూర్ను తాత్కాలికంగా నిలిపివేశామని, అయితే పాక్ చర్యల ఆధారంగా సిందూర్ పార్ట్ 2, పార్ట్ 3 ప్రారంభం కావచ్చని హెచ్చరించారు.

Published By: HashtagU Telugu Desk
Rajnath Singh

Rajnath Singh

Rajnath Singh on Operation Sindoor:  రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రస్తుతం మొరాకోలో పర్యటనలో ఉన్న సందర్భంగా అక్కడి ప్రవాస భారతీయులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. పాకిస్థాన్ ఉగ్రవాదులకు మద్దతిస్తున్న నేపథ్యంలో భారత్ పాక్ భూభాగంలోని ఉగ్రశిబిరాలపై సింధూర్ ఆపరేషన్ చేపట్టిందని తెలిపారు. సరిహద్దుల్లోనే కాకుండా 100 కిలోమీటర్ల లోతులోనూ భారత్ దాడులు చేసినట్లు చెప్పారు.

ఆపరేషన్ సింధూర్ను తాత్కాలికంగా నిలిపివేశామని, అయితే పాక్ చర్యల ఆధారంగా సిందూర్ పార్ట్ 2, పార్ట్ 3 ప్రారంభం కావచ్చని హెచ్చరించారు. ఉగ్రవాదులపై మతం చూసి దాడి చేయలేదని, వారు చేసిన చర్యల ఆధారంగా సమాధానం ఇచ్చామని స్పష్టం చేశారు. పహల్గాంలో జరిగిన దాడి తర్వాత దేశంలోని త్రివిధ దళాల అధిపతులతో సమావేశమైన సందర్భాన్ని గుర్తు చేస్తూ, సైన్యం సిద్ధంగా ఉందని తాను అడగగానే వారు వెంటనే స్పందించారని చెప్పారు. ఆ తర్వాత ప్రధాని మోదీని కలవగా, ఆయన సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని వివరించారు.

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) విషయంలో కూడా రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకే మనదేనని, అది నెమ్మదిగా జరిగే ప్రక్రియ అని చెప్పారు. ఆ ప్రాంత ప్రజలే భారత్‌లో కలవాలని కోరుకుంటున్నారని, అక్కడ నినాదాలు కూడా వినిపిస్తున్నాయని తెలిపారు. ఇది దాడులతో కాదు, ప్రజల ఆకాంక్షలతో సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, అమెరికా టారిఫ్‌లపై స్పందిస్తూ, రాజనీతికంగా తక్షణ స్పందనలు అవసరం లేదని, దీనిపై విశాల దృక్కోణంతో ఆలోచించాలన్నారు.

ఏప్రిల్ 22న పహల్గాంలో పాక్‌కు చెందిన ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడి హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 26 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. దానికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో పాక్ మరియు పీఓకేలోని 9 ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది.

ఈ నేపథ్యంలో భారత్ పాక్‌తో సంబంధాలను పునఃసమీక్షిస్తూ, సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. అలాగే పాక్ పౌరులు భారత్‌ను తక్షణమే విడిచిపెట్టి వెళ్లాలని కూడా సూచించింది.

ఇవన్నీ చూస్తే, భవిష్యత్తులో పాక్ దూకుడు పెరిగితే, భారత్ సిందూర్ పార్ట్ 2ని మొదలుపెట్టేందుకు వెనుకాడదని రక్షణ మంత్రి స్పష్టం చేశారు.

  Last Updated: 22 Sep 2025, 12:45 PM IST